Saturday, May 4, 2024

YCP vs TDP – ప‌లాస‌లో క‌ల్వర్ట్ కూల్చివేత …అడ్డుకున్న టిడిపి ఎంపి, ఎమ్మెల్యేలు అరెస్ట్

పలాస పట్టణంలో గ‌త అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. అక్రమణ నిర్మాణాల కూల్చివేత పేరిట టీడీపీ నేతలపై వేధింపులకు దిగుతున్నారంటూ ఆందోళనకు దిగిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల‌లోకి వెళితే పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సాగునీటి కాలువపై పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నారు. అయితే, ఈ కల్వర్టు నిర్మాణం అక్రమమంటూ ఇటీవల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందంటూ కల్వర్టు తొలగించేందుకు సిద్ధమయ్యారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత సామాగ్రితో కల్వర్టు వద్దకు చేరుకున్నారు.

నాగరాజుకు మద్దతుగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటూ పలువురు టీడీపీ నాయకులు ఘటనాస్థలంలో ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అధికారులు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నాయకుడు నాగరాజును ఇబ్బంది పెట్టడానికే కల్వర్టు ను కూల్చివేశార‌ని టీడీపీ నేతలు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement