Tuesday, May 14, 2024

మ‌గువ‌లు, జూదం.. సంస్కృతిని దెబ్బ‌తీసే ఆధారాలున్నాయి.. క్యాసినోపై చంద్రబాబుకు నివేదిక

అమరావతి: గుడివాడ క్యాసినో వ్యవహారంపై పోరాటం కొనసాగించాలని టిడిపి నిర్ణయించింది. గుడివాడ క్యాసినో పై టిడిపి నిజనిర్థారణ కమిటీ సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబుకు తమ నివేదిక అందజేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహణ, మంత్రి కొడాలినాని ప్రమేయంపై సేకరించిన సమాచారాన్ని సభ్యులు రిపోర్ట్ రూపంలో అధినేతకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో అందజేశారు. గుడివాడ పర్యటనలో పోలీసులు తమను అడ్డుకున్న విధానం, అక్కడ జరిగిన దాడిపై అధినేతకు వివరించారు. తమ పరిశీలన, వివిధ మార్గాల ద్వారా తాము సేకరించిన సమాచారం ప్రకారం…. మంత్రి కొడాలి నాని అండదండలతోనే క్యాసినో నిర్వహణ జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. వివిధ వీడియోలు, ఇతర ప్రాంతాల నుంచి క్యాసినో నిర్వహణ కోసం వచ్చిన యువతులు, ఇతర నిర్వాహకుల వివరాలను ఆధారాలతో నివేదికలో పొందుపరిచారు.

వందల కోట్లు చేతులు మారిన వ్యవహారం కావడంతో పాటు సంస్కృతిని దెబ్బ తీసేలా మూడు రోజుల పాటు కార్యకలాపాలు జరిగాయని నిజనిర్థారణ కమిటీ సభ్యులు అధినేతకు వివరించారు. దాడులు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ సభ్యులు చేసిన పోరాటాన్ని చంద్రబాబు కొనియాడారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ కోరుతూ గవర్నర్ ను కలవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. క్యాసినో వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చెయ్యాలని నిర్ణయించారు. చంద్రబాబును కలిసి నివేదిక ఇచ్చిన వారిలో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర, మాజి ఎంపి కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పార్టీ మహిళా నాయకురాలు సునీత ఉన్నారు.

వర్ల రామయ్య, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు:-
గుడివాడలో క్యాసినో నిర్వహణపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. గవర్నర్ ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. మా పరిశీలనలో ఆధారాలు లభించాయి. రేపు సమయం ఇవ్వాలని గవర్నర్ కార్యాలయాన్ని కోరాము. క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారు అని వర్ల రామయ్య అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి నిజాలు నిగ్గు తేల్చాలని…..ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ టాక్స్ లు సమగ్ర దర్యాప్తు చేయాలని అన్నారు. కొడాలినాని కి బేడీలు తప్పవని….అతన్ని వదిలేది లేదని వర్ల రామయ్య అన్నారు. నిజాల్నికప్పిపుచ్చేందుకే కొడాలినాని బూతులతో విరుచుకుపడుతున్నారన్నారు. తాను పోలీసుల అధికారిగా కొడాలినాని ని ఎన్నిసార్లు కొట్టాను, ఏఏ కేసులు పెట్టానో నేను ఇప్పుడు చెప్పనని రామయ్య అన్నారు. పోలీసు అధికారిగా తాను అప్పట్లో చేసిన పనులు ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదని….అవన్నీ కొడాలి నానికి, ఆయన తండ్రికి తెలుసని వర్ల రామయ్య అన్నారు.

కొల్లు రవీంద్ర, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు:-
మహిళల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసిన సిగ్గులేని మంత్రి కొడాలి నాని అని కొల్లు రవీంద్ర విరుచుకు పడ్డారు. క్యాసినో అంశాన్ని ఇంతటితో వదలం, జాతీయ స్థాయిలో పోరాడతాం అని కొల్లురవీంద్ర చెప్పారు.

ఆలపాటి రాజా, మాజీమంత్రి:-
రాష్ట్రం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని….రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో పాలన ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ గణతంత్ర దినోత్సవం రోజు గవర్నర్ ను కలుస్తాం అని ఆలపాటి రాజా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement