Thursday, May 2, 2024

AP: కేశినేని నానిని చిత్తుగా ఓడిస్తాం… త‌మ్ముడు చిన్ని ప్ర‌తిజ్ఞ‌

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : కేశినేని నానిని చిత్తుగా ఓడిస్తామ‌ని ఆయ‌న త‌మ్ముడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివనాథ్ (చిన్ని) ప్ర‌తిజ్ఞ చేశారు. కేశినేని నాని విలువలు కోల్పోయి రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ పైన, అధినేత పైన విమర్శలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. 1999 నుండి త‌మ కుటుంబంలో ఉన్న కలహాలకు చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. నాని నన్ను ఎన్ని విధాలుగా విమర్శించినా సర్దుకుంటూ పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి అర్హత నానికి లేదన్నారు. ఎంతోమంది మహామహులు తెలుగుదేశం పార్టీని వీడినా పార్టీ మాత్రం సంస్థాగతంగా బలంగా ఉందని.. వచ్చే వాళ్ళు వస్తుంటారు.. పోయే వాళ్ళు పోతుంటారని, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఏం కాదన్నారు. త‌మ కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క సమస్య నేటితో తీరిపోయిందన్నారు.

త‌మ కుటుంబంలో చాలా కాలం నుండి గొడవలు ఉన్నాయన్నారు. వాటిని పార్టీతో ముడిపెట్టడం దారుణమ‌న్నారు. చంద్రబాబుకు త‌మ కుటుంబం నుండి క్షమాపణ చెప్పుకొంటున్నానన్నారు. నాని విలువలు కోల్పోయి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. 2వేల కోట్లు ఎలా నష్ట పోయాడో చెప్పాలన్నారు. 2014 అఫిడివిట్ లో చూస్తే తెలుస్తుందన్నారు.. ఆయన మీద ఉన్న కేసులు.. ఆస్తులు గురించి అన్నీ అందులో ఉన్నాయన్నారు. విజయవాడ ప్రజలు టీడీపీ వైపే వున్నారనీ.. ఎవరు ఉన్నా లేకున్నా కార్యకర్తలు మాత్రం వెన్నంటే ఉన్నారన్నారు. ఎవరో ఒకరు ఇద్దరు అనామకులు నానితో వెళ్తే పార్టీ కి ఏమీ నష్టం లేదన్నారు. 60శాతం టీడీపీ ఖాళీ కావడం కాదు, 70 శాతం వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే లక్షన్నర మెజారిటీతో విజయవాడ పార్లమెంటులో టీడీపీ గెలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement