Sunday, April 28, 2024

AP: మహాజన రాజేష్ కు టికెట్ కేటాయింపుపై.. టీడీపీ ఆఫీస్ ముట్టడి…

రానున్న ఎన్నికల్లో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ ను వివాదాస్పదుడైన మహాజన రాజేష్ కు కేటాయించడం పట్ల బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్నాయి. దీనికి నిరసనగా విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసును పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ముట్టడించారు. అనంతరం టీడీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో నిర్వహించిన ధర్నాలో బ్రాహ్మణ సంఘ నాయకులు విజయ్ సోమయాజుల, అయ్యలూరి నాగ శాస్త్రి, శివ గణేష్ శర్మ, అధికారుల అశోక్, వడ్డాది ఉదయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సంస్కారం లేని వ్యక్తి అయిన మహాసేన రాజేష్ కు గన్నవరం టికెట్ ను కేటాయించడం యావత్ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినట్లేనని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకు బ్రాహ్మణుల పట్ల, హిందూ మతం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలున్నా వెంటనే మహాసేన రాజేష్ కు కేటాయించిన టికెట్ రద్దుచేసి దళితుల్లో ఉన్న ఉత్తముడికి ఆ టికెట్టును కేటాయించాలని వారు కోరారు. తద్వారా రాజేష్ లాంటి వ్యక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మరొక్కసారి పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే యావత్ బ్రాహ్మణ సమాజం వారికి అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఈ సందర్బంగా అనేక మంది రాజేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజేష్ కు ఇచ్చిన టీడీపీ టికెట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement