Thursday, April 25, 2024

భవనం కుప్పకూలి ముగ్గురు మృత్యువాత పడడం దురదృష్టకరం : విశాఖ‌ మేయర్

విశాఖపట్నం : పాత భవనం కూలి ముగ్గురు మృత్యువాత పడటం దురదృష్టకరమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె నాలుగవ జోన్ పరిధి రామజోగిపేటలో మూడు అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవనం కూలిన సంఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారని, మరో ఐదుగురుకి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సంఘటన స్థలంలో చనిపోయిన వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఇది ఎంతో బాధాకరమైన విషయమని, ఇటువంటి సంఘటనలో పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ కుటుంబాన్ని జీవీఎంసీ తరఫున ఆదుకుంటామని తెలిపారు. ఈ భవనం దాదాపు 40 సంవత్సరాలు క్రితం నిర్మించినదని రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు భవనం కుప్పకూలిందని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ప్రమాదం స్థలంలో ఎస్ డిఆర్ఎఫ్ 25 మందితో కూడిన బృందం సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టిందని, చుట్టుపక్కల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బ్రీస్ తొలగించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.

నాలుగవ జోన్ పరిధి పురాతన నగరం కావున చాలా వరకు పురాతన భవనాలు ఉన్నాయని వాటన్నిటినీ పరిశీలించి ప్రమాదం వాటిల్లే భవనాలను నోటీసులు ఇచ్చి ఆయా ఇంటి యజమానులతో మాట్లాడి, వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయాలని జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబుకు సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని జీవీఎంసీ యంత్రాంగం సహాయక చర్యలు వెంటనే ప్రారంభించిందని తెలిపారు. నగరంలో ఉన్న పురాతన భవనాలను గుర్తించి ఒక నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పురాతన భవనాలను ఆ భవన యజమానులతో మాట్లాడి ఖాళీ చేయించి ప్రమాదపు అంచుల్లో ఉన్న భవనాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవన వ్యర్ధాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement