Sunday, May 5, 2024

సామాన్య భక్తులకు టీటీడీ ఇంపార్టెన్స్​.. వారాంతపు సేవలు రద్దు చేస్తూ నిర్ణయం

తిరుపతి, ప్రభ న్యూస్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. వేసవి సెలవులు కావటంతో తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెంకన్న సన్నిధిలో సామాన్య భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జూలై 15వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్టుగా ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను పరిమితం చేశామని, తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు సౌకర్యాలు మరింతగా పెంచారు. నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నామని ఈవో తెలిపారు. ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువ సున్నం, కార్పెట్లు వేశామన్నారు.

పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామన్నారు ఈవో. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఏప్రిల్‌ 24 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించినట్లు- ధర్మారెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు- బుక్‌ చేసుకున్న భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత స్లాట్‌లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు టీ-టీ-డీ అనేక సౌకర్యాలు కల్పిస్తోందని.. దీంతో పాటు- విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మే 15 నుంచి 17 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని ఆకాశగంగ వద్ద వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఇకపోతే, ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు- బుక్‌ చేసుకున్న భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత స్లాట్‌లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement