Sunday, May 19, 2024

AP | 9 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ఇప్పటికే 9 పాలిటెక్నిక్‌ లలో 17 ప్రోగ్రామ్స్‌ కు నేషనల్‌ బోర్డ్‌ ఆప్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) దక్కగా, మరో తొమ్మిది ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లు కొత్తగా ఎన్‌బీఏ గుర్తింపు పొందాయి. నంద్యాల, కలికిరి, పార్వతీపురం, రాజంపేట, కాకినాడ, కాకినాడ, ధర్మవరం, చంద్రగిరి, గుంటూరు, ఆత్మకూరు పాలిటెక్నిక్‌ కళాశాలలకు నూతనంగా ఎన్‌బిఏ గుర్తింపు లభించింది. ఈ మేరకు శనివారం నెపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్‌ ఎన్‌బీఏ పొందిన పాలిటెక్నిక్‌ల వివరాలను తెలిపారు.

- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లకు నేషనల్‌ బోర్డ్‌ ఆప్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) సాధించాలన్న సాంకేతిక విద్యా శాఖ ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తున్నాయని సురేష్‌ కుమార్‌ అన్నారు. అన్ని పాలిటెక్నిక్‌ లు ఆదిశగా విజయం సాధించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. పాలిటెక్నిక్‌ విద్యను అంతర్జాతీయ స్దాయి ప్రమాణాల మేరకు నిర్వహించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో ముందడుగు వేస్తున్నామన్నారు.

ప్రతి ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ను ఉన్నత స్ధాయి ప్రమాణాల మేరకు తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఫలితంగా ఇప్పటివరకూ శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి, గన్నవరం, కళ్యాణ దుర్గం , అముదాలవలస, గుంటూరు, నంద్యాల, కలికిరి, పార్వతీపురం, రాజంపేట, కాకినాడ, ధర్మవరం, చంద్రగిరి, ఆత్మకూరు పాలి-టె-క్నిక్‌ లు వేర్వేరు బ్రాంచ్‌ లలో ఎన్‌బీఏ గుర్తింపును దక్కించుకున్నాయన్నారు.

రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లు ఉండగా తొలిదశలో 41 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లకు ఎన్‌బీఏ కోసం ప్రయత్నించామని సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకూ 18 పాలిటెక్నిక్‌ లు ఎన్‌బీఏ గుర్తింపు పొందాయాన్నారు. మిగిలిన 46 పాలిటెక్నిక్‌ లలో 43 సంస్ధలకు 2024-2025 విద్యా సంవత్సరంలో గుర్తింపు వచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని స్పష్టం చేసారు.

రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్‌ లకు ఎన్‌బీఏ

రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్‌ లకు ఎన్‌బీఏ లభించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్‌ బోర్డు ఆప్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయన్నారు. విద్యార్ధులకు ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్న దానిని కూడా ఎన్‌బీఏ పరిగణనలోకి తీసుకుంటుందని, ఆక్రమంలో వారికి తక్షణం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదనపు అన్‌ లైన్‌ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement