Saturday, May 18, 2024

నాడు-నేడు అంటే విద్యార్థులు ఫెయిల్‌ అవ్వడమేనా? టీడీపీ అధినేత‌ చంద్రబాబు ప్ర‌శ్న‌..

అమరావతి, ఆంధ్రప్రభ: నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి, నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకి పొంతనే లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ హయాంలో 90-95 శాతం ఉన్న ఉత్తీర్ణత.. ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనమని మంగళవారం ట్విట్టర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవడం, వారికి బోధనేతర పనులు అప్పగించడం, బడుల విలీనం సహా ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యస్థ విధానాలే నేటి ఈ పరిస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు.

సీఎం జగన్‌ చెప్పిన నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అవ్వడమేనా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదనకు గురి చేయడమేనా అని ప్రశ్నించారు. రెండు లక్షలమందికిపైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడ ఫెయిల్‌ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప విద్యార్థులు కాదని అంతా గుర్తించాలన్నారు. పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వ్యవస్థలో లోపాలకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement