Thursday, April 25, 2024

నీటి లభ్యత, వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి.. స్పీకర్ తమ్మినేని

ఆమదాలవలస, రూరల్, జూన్ 5 : నీటి లభ్యత వినియోగంపై ప్రతిఒక్కరూ సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. ఆమదాలవలస మండలం కత్యాచార్యుల పేట పంచాయతీ పరిధిలోని ఈసర్ల పేట గ్రామంలో సుమారు 8.60 లక్షల నిధులతో, మండాది గ్రామంలో సుమారు 23.30 లక్షల వ్యయంతో, జొన్నవలస పంచాయతీ పరిధిలోని ఈసర్ల పేట గ్రామంలో 23.50 లక్షల వ్యయంతో జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి పథకాన్ని సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా త్రాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. సగటు పౌరుడు కు అవసరమయ్యే త్రాగు నీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా విస్తృత పరిశోధనలు జరగడం శుభ పరిణామమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరికి అందించడమే తమ ప్రభుత్వం అంతిమ లక్ష్యమన్నారు. కలుషితమైన నీరు తాగే క్రమంలో పలు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయన్నారు. స్వచ్ఛమైన గాలి ఎంత ముఖ్యమో, స్వచ్ఛమైన నీరు అంత అవసరమ‌న్నారు. నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు జల జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన త్రాగు నీరందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేల, గాలి, నీరు అనేవి జీవజాతి మనుగడకు అత్యంత ఆవశ్యకమైనవన్నారు. భూతలంలో ఉన్న నీటి వనరులు వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉంటాయన్నారు.

భూమి అంతర్భాగంలో ఉన్న నీటి వనరులను ప్రాధాన్య క్రమంలో రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 90శాతం మేర మానవ వినియోగానికి ఉపకరించని నీటిని.. ప్రజలకు ఉపయుక్తకరంగా మార్పు చేయుట ద్వారా శాస్త్ర వేత్తలు పరిశోదనలు కొనసాగిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలలో చాలా చోట్ల మంచినీటి లభ్యత చాలా తక్కువ గా ఉందని, మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాలలో మంచినీటి సమస్య వలన కొన్ని జీవజాతులు అంతరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న జనాభాకి సరిపడా నీటి వనరులు సృష్టించే దిశగా సాగుతున్న అధ్యయనాలు, సత్ఫలితాలు రానున్నాయని అన్నారు.నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్ తరాలు మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు.మానవునికి ప్రతీ అవసరంలోనూ నీటి వినియోగం అత్యంత ఆవశ్యకమని, ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. భూగర్భ జలాల సద్వినియోగం పై గ్రామీణ ప్రజానీకానికి అవగాహన కల్పించేలా చొరవ చూపాలని సూచించారు…ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున చేపట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బెoడి గోవిందరావు, పి ఎ సి ఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు గోంటి కృష్ణ, గురుగుబెల్లి ప్రభాకరరావు, రెడ్డి నర్సింగరావు, గండ్రిడ్డి రమణ, గండ్రెడ్డి శ్రీరాములు, అంబటి లక్ష్మణ రావు వైయస్సార్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement