Thursday, April 25, 2024

Telugudesam – రాయ‌లసీమ ద్రోహిని ఓడించండి – ఓట‌ర్లకు చంద్ర‌బాబు పిలుపు

అభివృద్ధి మాది – నాశనం ఆయనది
నీళ్లు లేవు.. మళ్లీ కరువే వచ్చింది
జే బ్రాండ్లు ఉండవు – గంజాయిని అరికడతాం
పరిశ్రమలు తెస్తాం – సంపద సృష్టిస్తాం
అందరికి పంచుతాం ..
పలమనేరు రోడ్ షోలో చంద్రబాబు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – రాయల సీమను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. డీడీపీ, జనసేన. బీజేపీ కూటమి ఎన్నికల భేరీని బుధవారం ప్రజాగళం యాత్ర పేరిట పలమనేరులో మోగించారు. చంద్రబాబు రోడ్ షోకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను ఐదేళ్ల పాటు మోసం చేశారన్నారు.

ఖాళీ రోడ్లతో జగన్ కు స్వాగతం పలకండి

రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమి లేదన్నారు. అనంతపురానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాను మరింత అభివృద్ధి చేశానని తెలిపారు. నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి.. నీళ్లు వస్తే అభివృద్ధి, సంపద పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. జగన్‌ సిద్ధం అంటూ మరో మెసపూరిత యాత్రకు వస్తున్నారని.. ఆయనకు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు.

జగన్ రాయలసీమ ద్రోహి

జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒకప్పుడు రాయలసీమ రత్నాల సీమగా ఉండేదని, రాయలవారు ఏలిన ప్రాంతాన్ని జగన్ సర్వనాశనం చేసారన్నారు. నాడు దివంగత నేత ఎన్టీఆర్ రాయలసీమను‌ సస్యశ్యామలం చేశారన్నారు. కరువు సీమగా ఉన్న రాయలసీమలో అన్ని రంగాలను తాను సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు. తమ వద్దకు రావడానికి వీలులేదని ప్రజలంతా జగన్‌కు చెప్పాలన్నారు. ఏపీని జగన్ సర్వ నాశనం చేశారని విమర్శించారు. జే బ్రాండ్ మద్యం, గంజాయి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించే రోజు మే 13 అవుతుందన్నారు.
పరదాల వీరుడితో జాగ్రత్త

- Advertisement -

పరదాల వీరుడు జగన్ ముసుగులతో బస్సుయాత్ర మొదలుపెట్టారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదని, పెన్షనర్లకు ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి.. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. . రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే13వ తేదీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆరోజుతో రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోతుందని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement