Friday, April 26, 2024

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు

ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. మైనింగ్‌ లీజులు మంజూరు చేసిన కుట్రలో శ్రీలక్ష్మి ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలను ఇచ్చినట్లు ఆమె నిరూపించుకోవాల్సి ఉందని ఆదేశించింది.

ఓఎంసీ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయడంతో పాటు పరిహారం ఇప్పించాలని కోరుతూ శ్రీలక్ష్మి 2015లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. మైనింగ్ లీజులు కేంద్ర పరిధిలోనివని, ఇందులో తన పాత్ర ఏమీ లేదన్న శ్రీలక్ష్మి వాదనను అంగీకరించలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఓఎంసీకి లీజులు మంజూరు చేసిన కుట్రలో ఆమె ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. జీవోలో క్యాప్టివ్ మైనింగ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది నిర్ధారించడానికి విచారణను ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొంది. కింది కోర్టు విచారించినప్పుడు తనకు రక్షణగా ఉన్న అన్ని అంశాలను వినియోగించుకోవచ్చని సూచిస్తూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

కాగా, ఉమ్మడి రాష్ట్రంలో 2007 నుంచి 2009 వరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది. అనంతపురంలోని ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించిందన్న ఆరోపణలతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా అక్రమ మైనింగ్ లైసెన్సులు మంజూరు చేసేందుకు కుట్ర పన్నడం ద్వారా ఆమె తనకున్న అధికారాలను దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపణ. ఈ కేసులో ఆమెను ఆరో ముద్దాయిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement