Saturday, April 27, 2024

కేశినేని భవన్ లో చంద్రబాబు ఫొటో తొలగింపు.. నాని పార్టీ మారుతారా?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. విజయవాడలోని కేశినేని భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోను తొలగించడం.. ఈ ప్రచారాన్ని బలం చేకూరుస్తుంది. చంద్ర‌బాబు ఫొటోల‌తో పాటుగా టీడీపీ నేత‌ల ఫొటోల‌ను కూడా తొల‌గించారు. గ్రౌండ్ ఫ్లోర్‌, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేత‌ల ఫ్లెక్సీల‌ను సిబ్బంది తొల‌గించారు. అయితే, నేత‌ల ఫొటోల స్థానంలో ర‌త‌న్ టాటా ఫొటోలను ఉంచారు. దీంతో కేశినేని నాని బీజేపీలోకి చేరబోతున్నారంటూ ఊహాగానాలు మొదలైయ్యాయి.

గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. అంతే కాదు 2024 ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. విజయవాడలోని టీడీపీ నేతలతో విభేదాల కారణంగా ఆయన పార్టీని వీడాలని భావిస్తున్నట్లు అంతా భావిస్తున్నారు. అయితే, పార్టీ మార్పు విషయంపై కేశినేని నాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు నానికిపార్టీ మారే ఆలోచన లేదని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారనే వార్తలపై విజయవాడ టీడీపీ నేత ఫతావుల్లా ఖండించారు. కేశినేని భవన్ లో చంద్రబాబు ఫొటో తొలగింపు వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించారు. కేశినేని భవన్ లో ఒక ఛాంబర్ లో మాత్రమే చంద్రబాబు ఫొటోను మర్చారని, ఆఫీసు బయట, లోపల మిగతా గదుల్లోనూ చంద్రబాబు, ఎన్టీఆర్ ఫొటోలు యథావిథిగా ఉన్నాయని ఫతావుల్లా స్పష్టం చేశారు. చంద్రబాబుతోపాటు ఇతర నేతల ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయని చెప్పారు. మొత్తం మీద కేశినేని నాని అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి.

ఇది కూడా చదవండి: యాద్రాద్రికి సీఎం కేసీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement