Wednesday, May 15, 2024

Delhi: వ్యవస్థలో లోపాలతోనే పన్నుల ఎగవేత.. ఎంపీ విజయసాయి ప్రశ్నకు నిర్మలా బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పన్నుల ఎగవేతకు సంబంధించి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటో వివరించాలని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), ఆదాయ పన్ను శాఖ, జీఎస్టీ వంటి సంస్థలు కస్టమ్స్‌ సుంకాన్ని ఎగవేసిన పలు మొబైల్ కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి.

కార్పొరేట్ కంపెనీలు టాక్స్‌లు, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. అలాగే కార్పొరేట్‌ కంపెనీలు ఎగవేసిన పన్నుల మొత్తం ఏమేరకు ఉన్నాయో ప్రభుత్వం మదింపు చేసిందా అని కూడా ఆయన ప్రశ్నించారు. పన్నులు ఎగవేసిన తర్వాత నోటీసులు జారీ చేయడం కంటే కార్పొరేట్ సంస్థలు నిర్ణీత సమయంలో సుంకాలు, పన్నులను తప్పనిసరిగా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విజయసాయిరెడ్డి చేసిన సూచనతో ఏకీభవిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. కార్పొరేట్‌ కంపెనీల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత ఏమేరకు ఉందో ప్రభుత్వం మదింపు చేయలేదని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement