Thursday, May 2, 2024

AP : బలమైన మహిళా ఉద్యమాలే – స్త్రీల హింసకు పరిష్కారం… ఉత్తరాంధ్ర మహిళా సంఘం పిలుపు

(అమరావతి – ఆంధ్రప్రభ)
దేశంలో కీలకంగా ప్రతి ఒక గంటకు 50 మంది హత్యలు, అత్యాచారాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని మహిళా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం కాశీబుగ్గలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉత్తరాంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సంఘాల మహిళా సంఘాల నాయకురాళ్లు మాట్లాడారు.

మహిళలపై హింస పెరగడానికి కారణం మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సాహిత్యం, వెబ్సైట్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. స్త్రీలు ఇంట, బయట తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తంచేశారు. అనేకమంది అన్యాయానికి గురౌతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయని పలు సంఘటనలను వివరించారు. నేరస్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక నేరస్తులు చట్టాలని, న్యాయవ్యవస్థని, డబ్బుతో, అధికారంతో ప్రభావితం చేసి, హీరోయిజంగా తిరుగుతూ కవింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇట్లాంటి అనివార్య పరిస్థితులలో స్త్రీలు సమస్యలు పరిష్కరించుకోవాలంటే బలమైన మహిళా ఉద్యమాలను నిర్మించుకోవడమే మన ముందున్న పరిష్కారం అంటూ ఉత్తరాంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పి.నాగమణి మహిళా లోకానికి పిలుపునిచ్చారు. మహిళలను చైతన్యవంతుల్ని చేసి, సంఘటిత మహిళా ఉద్యమాలు నిర్మాణం కోసం కరపత్రం రూపంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పి.కుసుమ, జిల్లా కమిటీ సభ్యులు కె.హేమమ్మ, బి.జానకి, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకురాలు యు.జ్యోతి, ఎస్.సీతమ్మ తదితరులు పాల్గొని కరపత్రాలు ఆవిష్కరణ చేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement