Wednesday, May 15, 2024

గుడ్ మార్నింగ్ ఆమదాలవలస.. స్పీకర్ తమ్మినేని

గుడ్ మార్నింగ్ ఆమదాలవలస అంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇదొక వినూత్నమైన కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లక్ష్ముడిపేట వార్డులో ఇంటింట పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో లక్ష్మడుపేట నుండి వెంకంపేట వెళ్లే లింక్ రోడ్డు, కాలువలు నిర్మించాలని ప్రజలు స్పీకర్ ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమంలో తిరిగినప్పుడు ఎక్కువగా డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలే తన దృష్టికి వచ్చాయని అన్నారు. అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే విధంగా కొంతమంది మున్సిపల్ కుళాయి నీటిని చౌర్యం చేస్తున్నారని, మోటర్ల ద్వారా ట్యాంకులకు నింపుతున్నారని తెలిపారు. దీంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్న వారికి మంచి నీరు రాక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆకస్మిక తనిఖీలు చేసి మోటార్ లను తొలగించాలని అధికారులకు స్పీకర్ ఆదేశించారు. ఈ విధంగా తిరగడం వలన ప్రజల సమస్యలు తెలుస్తాయని దాని ద్వారా జవాబుదారితనం పెరుగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement