Thursday, May 2, 2024

ఉద్యోగాలు లేని ఏపిపిఎస్సీ ఎందుకు?: సోము సూటి ప్రశ్న

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శనివారం ఉదయం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ తిరుమలలో నిర్ణయం తీసుకుంటే, అందరితో సంప్రదించి తీసుకుంటే బావుంటుందన్నారు. తిరుమలలో చలువ పందిళ్ళు వేయడం లేదని తెలిపారు. 3500 కోట్లలో ధర్మ ప్రచారానికి ఎంత కేటాయిస్తున్నారని సోము ప్రశ్నించారు. టిటిడి ఆధ్వర్యంలో టిటిడి వేద పాఠశాలలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధార్మిక పరిషత్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వం ధార్మిక పరిషత్ ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సినిమా వాళ్ళను ఎస్వీ బిసిలో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఎస్వీబిసిలో సినిమా పాటలు వేస్తున్నారని, ధర్మం గురించి తెలియని వారు సంస్థలో ఉన్నారని పేర్కొన్నారు.

టిటిడి నుంచి ఐదు వేల కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని తాము అడ్డుకున్నామన్నారు. ఎంబిబిఎస్ అడ్మిష్ల విషయం విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సోము అన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఒక మాటపైకి వచ్చి విద్యార్థులుకు అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో వచ్చిన జీవో ఆధారంగా బి.కేటగిరీ కోటాలో 15 సీట్లు మేనేజ్మెంట్ కోటాగా మారుస్తున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎంప్లాయ్ మెంట్ విషయంలో బి.జే.వై.ఎం తరపున పోరాటం చేస్తుమన్నారు. ఉద్యోగాలు లేని ఏపిపిఎస్సీ ఎందుకు? అని, మూసి వేయాలని డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసే బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలన్నారు. రైస్ మిల్లర్స్ మాఫియాతో ఏ పార్టీ పోరాటం చేయదని, బిజెపి మాత్రమే చేస్తుందని చెప్పారు. రైస్ మిల్లులు అన్నీ రీమిల్లింగ్ చేస్తున్నారని, ఇది అతిపెద్ద స్కాం అని తెలిపారు. వందల కోట్లు అవినీతి ట్రాన్స్ పోర్ట్, సివిల్ సప్లైలో జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ఎర్ర చందనం అక్రమాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తమిళనాడుకు సిలికాన్ సాండ్ అక్రమ ఎగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సిలికాన్ సాండ్, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్ట వేస్తే ఖజానా నిండుతుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement