Thursday, April 25, 2024

విచారణకు ఒక్క రోజు సరిపోదు- సుప్రీంకోర్టుని కోరిన రాష్ట్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ త్వరగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును కోరింది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేసు విచారణ తేదీల గురించి ప్రస్తావించగా ఇప్పటికే మార్చి 28వ తేదీని ఖరారు చేశాం కదా అంటూ ధర్మాసనం గుర్తుచేసింది. అయితే ఆ ఒక్క రోజుతో విచారణ పూర్తికాదని, అందుకే మార్చి 29, 30 తేదీల్లో కూడా ఈ కేసు విచారణ కొనసాగించేలా జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. అయితే బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల విచారణ చేపట్టరాదంటూ ప్రధాన న్యాయమూర్తి సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ క్రమంలో ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద ప్రస్తావించేందుకు అవకాశమివ్వాలని న్యాయవాదులు కోరారు. అందుకు అభ్యంతరం లేదని చెప్పిన జస్టిస్ జోసెఫ్, తన రిటైర్మెంట్ గురించి గుర్తుచేశారు. పదవీవిరమణ తేదీని మార్చలేమని, ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించేటప్పుడు ఈ అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాను పదవీవిరమణ చేయడం కంటే ముందే విచారణ పూర్తిచేయడం సాధ్యమయ్యేలా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement