Thursday, April 25, 2024

విజ‌య‌న‌గ‌రంలో కిట‌కిట‌లాడిన‌ శైవ‌క్షేత్రాలు

కార్తీక మాసం… రెండో సోమవారం… శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్త జనులు ఆలయాలకు చేరుకున్నారు. శివ నామస్మరణతో శివాలయాల పరిసరాలు మార్మోగాయి. ఏకాదశి మిగులు అంటూ మహిళలు గుళ్లు, గోపురాలను దర్శించుకున్నారు. పలు ఆలయాల్లో సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. భక్త జనులు భారీగా పాల్గొని మహన్యాస పూర్వకంగా జరిగిన రుద్రాభిషేకాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. చాలా మంది సత్యనారాయణ వ్రతాలు జరిపించుకున్న పరిస్థితి కనిపించింది. పల్లెలు, పట్టణాల‌న్నీ తేడా లేకుండా శివాలయాలన్నీ భక్త జన సమూహాలతో నిండిపోయాయి. అయితే, ఎప్పటిలాగానే పూజా సామాగ్రి ధరలకు భారీగా రెక్కలు రావడంతో ఈ సారి కూడా ఘోరం.. ఘోరం.. అనుకుంటూనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం ఓ మోస్తరు కొబ్బరి కాయ‌ రూ.40 నుంచి రూ.50 వరకు పలికిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రతి ఒక్కరికీ అవగతమవుతుంది. అరటి పళ్లు అయితే రూ.10 చేతిల పెడితే రెండు దొండకాయలు కలిస్తే వచ్చే పరిమాణంలో వున్న అరటి పళ్లు మూడు చేతిలో పెట్టేశారు వర్తకులు. పండగ వచ్చినా, పర్వ దినాలు వచ్చినా అమాంతం ధరలు పెంచి సొమ్ము చేసుకోవడానికి అలవాటుపడిన వర్తకుల ఆగడాలకు ఏ దశలోనూ అడ్డుకట్ట పడని పరిస్థితి అందరికీ తెలిసిందే. బహిరంగ మార్కెట్లు, చిన్నచిన్న కిరాణా దుకాణాలు.. ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. ధరల నియంత్రణ అన్నది ఏ దశలోనూ జరగకపోవడం వర్తకుల దోపిడీ పర్వం యథేచ్ఛగా సాగిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement