Friday, May 3, 2024

Delhi: ఏపీలో కేంద్రసంస్థల పురోగతిపై సమీక్ష.. ఉపరాష్ట్రపతికి వివరాలు తెలిపిన కేంద్రమంత్రులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో నెలకొల్పుతున్న పారిశ్రామిక సంస్థలు, శిక్షణా అకాడమీల పురోగతిపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయా సంస్థల పురోగతి గురించి ఆయన ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం పలువురు కేంద్రమంత్రులతో వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి చర్చించి, వాటిని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అనంతపురంలోని పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బి.ఈ.ఎల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ పురోగతి గురించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉపరాష్ట్రపతికి వివరించారు. బెంగళూరులోని మిసైల్స్ సిస్టమ్స్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్‌కు అనుసంధానంగా 2015లో ఈ సంస్థకు శంకుస్థాపన చేశారు. 900 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సంస్థ దేశంలోనే అతి పెద్దది. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ పురోగతి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉపరాష్ట్రపతి వివరాలు తెలిపారు. ఈ తరహా అకాడమీ భారతదేశంలో రెండవది కాగా, దక్షిణాదిన మొదటిది. ఈ ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

మిథాని, నాల్కో సంస్థల ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా నెల్లూరులో ఏర్పాటు చేయతలపెట్టిన హైఎండ్ అల్యూమినియం మిశ్రమం అభివృద్ధి, తయారీ సంస్థ ఏర్పాటు పనుల పురోగతి గురించి కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉపరాష్ట్రపతికి వెల్లడించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్న ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని వెంకయ్య సూచించారు. నెల్లూరు జిల్లాలోని తుపిలిపాళెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్.ఐ.ఓ.టి) పురోగతి గురించి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి డా. జితేంద్ర సింగ్ నుంచి ఉపరాష్ట్రపతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉత్పన్నమైన భూమి సమస్యలు కూడా పరిష్కారమైన నేపథ్యంలో, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వెంకయ్యనాయుడు 2015, 2016లో కేంద్రమంత్రి హోదాలో చొరవ తీసుకుని సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి, పనులను సమీక్షించి ఆయా ప్రాజెక్టులు మంజూరయ్యేందుకు కృషి చేశారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఆయా ప్రాజెక్టుల గురించి సంబంధిత మంత్రిత్వ శాఖలతో చర్చిస్తూ, సూచనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement