Friday, April 26, 2024

AP: కడప జిల్లాలో వాన బీభత్సం..! 24 గంటలు.. 232 మి.మీ వర్షం…

అన్నమయ్య బ్యూరో – ప్రభ న్యూస్: మైచాంగ్ తుఫాన్ ఉమ్మడి కడప జిల్లాపై పోరలు చాచింది. సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా నెల్లూరు తిరుపతి జిల్లాల సమీపంలో ఉండే రైల్వే కోడూరు బద్వేలు మైదుకూరు, కడప, రాయచోటి నియోజకవర్గంపై అధికంగా కనిపిస్తోంది. నెల్లూరు సమీపంలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మండలంలో గడిచిన 24 గంటల్లో 232 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు బ్రేక్ చేసింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని రైల్వే కోడూరు మండలంలో గత 24 గంటల్లో 80 మిల్లీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదయింది. దీంతో తిరుపతి రైల్వేకోడూరు మధ్య అంటే అన్నమయ్య తిరుపతి జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట బాలపల్లి వద్ద కొండల మధ్యలో వచ్చిన వర్షపు నీరు జాతీయ రహదారిపై ప్రవహించి రాకపోకలు స్తంభించేందుకు కారణమయ్యాయి. దీంతో తిరుపతి అన్నమయ్య జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నియోజకవర్గంలోని పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిసి బాలపల్లి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాహనదారులను నివారించి రోడ్డు మీదికి వచ్చే వర్షపు నీరును తప్పించుకొని ప్రయాణం చేసేవారు సురక్షితంగా ఉండేలా అధికారుల ద్వారా అప్రమత్తత చేయించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరులోని తన కార్యాలయంలో నియోజకవర్గ అధికారులు వైసీపీ నాయకులతో కలిసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వరద సహాయక చర్యలను చేపట్టడంలో అధికారుల బాధ్యతను గుర్తు చేస్తూ వారికి సహకరించడానికి వైసీపీ నాయకులను పురమాయించారు. దీంతో రైల్వేకోడూరు తిరుపతి మధ్య జాతీయ రహదారిపై నెలకొన్న వరదలను తప్పించుకొని వాహనదారులు సురక్షితంగా బయటపడడానికి అవకాశం ఏర్పడింది. ఇదిలా ఉండగా రైల్వే కోడూరు నియోజకవర్గం లోపల మండలాలు విద్యుత్ అంతరాయంతో అంధకారంలో చిక్కుకున్నాయి.

దీవుల్లా మారిన గ్రామాలు.. జలకలను సంతరించుకున్న చెరువులు

- Advertisement -

గత రెండు రోజులుగా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాగులు వంకలు పొర్లి చెరువుల్లో జలకళకు కారణమయ్యాయి. ప్రధానంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 24గంటల పాటు ఎడతెరిపి వాళ్ళను కురిసాయి. దీంతో అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు రాయచోటి కడప జిల్లాలోని బద్వేలు మైదుకూరు కడప నియోజకవర్గం భారీ వర్షాలు కురిసాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి కోడూరు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నమయ్య జిల్లాలో బుధవారం కూడా సెలవును ప్రకటించారు. ఈ తుఫాను తేలిగ్గా అంచనా వేయొద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి సురక్షితంగా మెలగాలని ఆయన సూచించారు.

భారీ వర్షాలు ఉన్నాయి.. బయటకు రావద్దు.. ఎమ్మెల్యే కొరముట్ల

తుఫాను కారణంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో వాతావరణ హెచ్చరికల ప్రకారం అతి భారీ వర్షాలు ఉన్నాయని ఎవరూ బయటికి రావద్దని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ… తుఫాను ప్రభావిత ప్రాంతంలో ప్రజలు పరిస్థితి అర్థం చేసుకొని ఇండ్లలోనే ఉండాలని కోరారు. దీనివలన ప్రాణ, ఆస్తి నష్టాలను అరికట్టవచ్చన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకొని సహాయక చర్యలు అవసరమైతే వెంటనే స్పందించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement