Sunday, May 19, 2024

టిడ్కో గృహాలకు రుణాలు త్వరితంగా మంజూరు చేయండి : కలెక్టర్‌ జె.నివాస్‌..

విజయవాడసిటీ, ప్రభన్యూస్‌ : జిల్లాలో కనీసం 1000 టిడ్కోగృహాలకు వారం రోజులోపు కనీసం రూ.30 కోట్ల రుణం మంజూరు చేయాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. బుధవారం నందిగామ పర్యటనకు వెళ్లిన కలెక్టర్‌ తిరిగి వస్తూ మున్సిపల్‌ కమీషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌, ఇతర మున్సిపల్‌ కమీషనర్లు, బ్యాంక్‌ కంట్రోలర్‌, టిడ్కో అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 19,376 టిడ్కోగృహాలకు రూ. 679 కోట్ల రుణం మంజూరు చేయాల్సివుందని చెప్పారు. అందులో ఇప్పటివరకు 2,019 గృహాలకు రూ. 32.52 కోట్ల మంజూరు చేశారన్నారు. అయితే వచ్చే వారం రోజులోపు 1000 గృహాలకు రూ. 30 కోట్లు మంజూరు చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో బేస్‌ మెంట్‌ లెవెల్‌ కంటే అధికంగా 75 శాతం గృహాల నిర్మాణం పూర్తి అయిందన్నారు.

ఇందులో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్లో మొత్తం 5,424 గృహాలకు రూ. 190 కోట్ల రుణం మంజూరు చేయాల్సివుందని చెప్పారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు రుణాల మంజూరుకు సమీక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వి.ప్రసన్న వెంకటేషను కోరారు. ఇప్పటి వరకు విజయవాడ కార్పొరేషన్లో 6.46 కోట్ల రూపాయలు, జిల్లాలోని ఇతర మున్సిపాలిటిలో రూ. 9.97 కోట్లు- యుబిఐ బ్యాంకు విడుదల చేసిందని కలెక్టర్ ప్రస్తావించారు. జిల్లాలో రుణం సౌకర్యం ఇచ్చేందుకు మరింత వేగం పెంచమని ఆయన కోరారు. జిల్లాలోని సప్తగిరి బ్యాంకు, ఎస్‌ బిఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సెంట్రల్‌ బ్యాంక్‌ తదితర బ్యాంక్‌ కంట్రోలర్లతో రుణం లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement