Sunday, May 12, 2024

Production Drop – డిసెంబ‌ర్ లోనే క‌రెంట్ క‌ష్టాలు….శ్రీశైలంలో ప‌డిపోయిన విద్యుత్ ఉత్ప‌త్తి..

క‌ర్నూలు : శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి విద్యుదుత్పత్తి పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి శనివారం వరకు 6.054 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అయింది. 1982లో శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం నిర్మించిన తర్వాత 1993-94లో అత్యధికంగా 3797.909 మిలియన్‌ యూనిట్ల గరిష్ఠ విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది 6.054 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తికి పడిపోవడంతో 2023-24 కనిష్ఠ విద్యుదుత్పత్తి జరిగిన సంవత్సరంగా నమోదయ్యే అవకాశముంది. వచ్చే మూడున్నర నెలల కాలంలో విద్యుదుత్పత్తికి ఇక అవకాశం లేకపోవచ్చని విద్యుత్తుశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వర్షాభావ పరిస్థితులే కారణం..!

కర్ణాటక, మహారాష్ట్రల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలోకి చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా జలాశయ నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. విద్యుత్కేంద్రంలో ఉన్న ఏడు యూనిట్‌లూ పూర్తిస్థాయిలో నడిస్తే ఒక్క రోజులో మొత్తం 18.48 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. దానికి 3.5 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం సాగునీటి అవసరాలకే నీరు సరిపోని పరిస్థితి ఉండడంతో విద్యుత్తు ఉత్పాదనను నిలిపేయాల్సి వచ్చింది. విద్యుత్ ఉత్పాద‌న త‌గ్గ‌డంతో ఎపిలో అన‌ధికార కోత‌లు త‌ప్ప‌వంటున్నారు.. డిమాండ్ స‌రిప‌డ విద్యుత్ కొనుగోలుకు ఇత‌ర రాష్ట్రాల‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని చెబుతున్నారు.. ఇప్ప‌టికే కేంద్రానికి అద‌న‌పు విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం కేంద్రానికి సైతం లేఖ‌లు రాశామ‌ని వెల్ల‌డిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement