Sunday, April 28, 2024

రేపు భీమవరానికి ప్రధాని, ముఖ్యమంత్రి.. అల్లూరి విగ్రహావిష్కరణ చేయనున్న మోడీ..

భీమవరం, ప్రభన్యూస్‌ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఏర్పాటు- చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ రేపు భీమవరం రానున్నారు. ఆయనతోపాటుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ హీరో చిరంజీవిలు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. సభా వేదిక పై నుండే సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా ఏర్పాట్లు- జరిగాయి. విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుండి క్షత్రియ వర్గంతో పాటు-గా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఒకపక్క వర్షం పడుతున్నప్పటికీ ఏర్పాట్లు- ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరవుతున్నారు.

అయితే అల్లూరి జయంతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గతనెల 27 నుండి వారం రోజులపాటు- వారోత్సవాలను జరుపుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం భీమవరం వచ్చిన ప్రధాని తిరిగి ఎనిమిది సంవత్సరాల తర్వాత భీమవరం రానుండటంతో ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారుగా 50 వేల మంది పైగానే సభకు హాజరయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాలకు, పట్టణాలకు రవాణా సౌకర్యం కల్పించారు. సుమారుగా రెండు వేల మందికి పైగానే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విగ్రహ ప్రాంగణాన్ని, సభా వేదిక ప్రాంగణాన్ని, హెలీప్యాడ్‌ ప్రాంగణాన్ని ఎపిజి తన ఆధీనంలోకి తీసుకుంది. స్థానిక శాసనసభ్యులు, అల్లూరి జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ గ్రంధి శ్రీనివాస్‌, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement