Friday, May 3, 2024

విధానకర్తల ఆలోచనలు భిన్నంగా ఉండాలి.. సంప్రదాయ పద్ధతిలో ఆలోచిస్తే ఏమీ సాధించలేరు: చంద్రబాబు

హైదరాబాదులో ఇవ్వాల (శనివారం) జరిగిన GFST (Global Forum for Sustainable Transformation) సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. GFST చైర్మన్ హోదాలో చంద్రబాబు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై చర్చించారు. స్పాట్ ఫ్లోక్ సీఈఓ శ్రీధర్ శేషాద్రి, గో నార్త్ వెంచర్స్ సీఈఓ సంజయ్ జస్రాని, ఇ అండ్ వై డైరెక్టర్ శ్రీరాం అయ్యర్, ఇ అండ్ వై పార్టనర్ రాందేశ్ పాండే, విజ్ గ్లోబల్ హెడ్ సతీష్ లక్కరాజు ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. మారిటైం గేట్ వే పబ్లిషర్ రాంప్రసాద్ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇక.. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పలు అంశాలపై ప్రసంగించారు. టెక్నాలజీ సమర్థంగా వినియోగించుకుంటే వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు… ఎవరైనా మంచి ఫలితాలు పొందుతారని పేర్కొన్నారు. తాను మొదటి సారి సీఎం అయిన సమయంలో భవిష్యత్ లో ఐటీలో ఉన్న అవకాశాలను గుర్తించానని తెలిపారు.

చంద్రబాబు ప్రసంగం హైలైట్స్..

  • హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టడంతో పాటు… ప్రపంచ వ్యాప్తంగా తిరిగి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడాను.
    ఇండియన్స్ కు ఉన్న సమర్థతల గురించి విస్తృతంగా ప్రచారం చేశాను. కంపెనీలకు ఇక్కడ ఉన్న మానవ వనరుల గురించి చెప్పాను.
  • ఇండియన్స్ కు ఇంగ్లీష్ లో, మ్యాథ్స్ లో ఉన్న సమర్థత గురించి వివరించాను. అదే సమయంలో ట్రిపుల్ ఐటీతో సహా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించాను. తద్వారా పెద్ద ఎత్తున ఐటీ రంగ నిపుణులు అందుబాటులోకి వచ్చారు.
    అయితే కొన్ని సమస్యలు తీవ్ర ఇబ్బందికరంగా ఉండేవి.
  • నాడు ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే కూడా గంటలు, రోజులు పట్టేది… ఇవన్నీ కంపెనీల ఏర్పాటుకు ఆటంకాలుగా ఉండేవి.
    అప్పుడే ప్రధాని వాజ్ పేయితో మాట్లాడి డీ రెగ్యులేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్ విధానాన్ని తీసుకువచ్చాను. సెల్ ఫోన్ ల రాకకు నాంది పడింది. తద్వారా ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
  • బిల్ గేట్స్ తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చాను. నాడు ఐటీ విప్లవాన్ని తెలుగు జాతి సమర్థవంతంగా ఉపయోగించుకుంది. మరోవైపు మెరికల్లాంటి యువత అవకాశాలను అందిపుచ్చుకుని దేశ విదేశాల్లో విస్తరించారు.
  • నేడు విదేశాల్లో నాలెడ్జ్ ఎకానమీ ద్వారా భారతీయులు, తెలుగు వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగిగా ఉన్న సత్య నాదెళ్ల నేడు ఆ సంస్థకు సీఈవో అయ్యారు.
  • ఇప్పుడు టెక్నాలజీ ఉన్నత స్థితిలో ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
    పేదరిక నిర్మూలనకు సాంకేతికతను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది చర్చించాలి. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి జరగాలి. ఇటువంటి సదస్సులు, GFST వంటి వేదికలు దానికి ప్రణాళికలు రూపొందించాలి.
  • 1991లో తెలుగు వ్యక్తి, నాటి ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలు ద్వారా దేశం అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది.
  • నేను ముఖ్యమంత్రి అయిన తరువాత పీపీపీ విధానాన్ని ప్రమోట్ చేశాను. మలేషియాలో రోడ్లు చూసి జాతీయ రహదారుల నిర్మాణానికి నాటి ప్రధానికి ప్రతిపాదనలు ఇచ్చాను. కేంద్రం డబ్బులు వెచ్చించే అవసరం లేకుండా రోడ్ల నిర్మాణంపై ప్రతిపాదనలు ఇచ్చి ప్రధానిని ఒప్పించాను.
  • స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ద్వారా తడ నుంచి చెన్నై వరకు మొట్టమొదట పీపీపీ విధానంలో రోడ్లు వేశాం.
    తరువాత కాలంలో ఈ విధానంతో జాతీయ రహదారుల రూపురేఖలే మారిపోయాయి. ఇదే విధానాన్ని రాష్ట్ర రహదారుల నిర్మాణంలో కూడా తీసుకువచ్చాం. మంచి ఫలితాలు వచ్చాయి.
  • అనేక సవాళ్లను ఎదుర్కొని విద్యుత్ రంగంలో సంస్కరణలను తీసుకువచ్చాను.
    టెక్నాలజీ కారణంగా ఎండ్ల బండ్ల నుంచి డ్రైవర్ లెస్ కార్ ల వైపు మనం ప్రయాణం చేస్తున్నాం.
    టెక్నాలజీ, పాలసీల సమర్థ అమలు ద్వారా పేదరికం లేని సమాజం నిర్మించవచ్చు. సమాజంలో సమూల మార్పులు తేవచ్చు. అదే నా జీవిత లక్ష్యం.
    భారత దేశానికి ఉన్న అనేక బలాల కారణంగా 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా మారుతుంది.
  • పాలసీ మేకర్స్ సంప్రదాయ పద్ధతుల్లో ఆలోచిస్తే మంచి ఫలితాలు రావు
    చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి సాంకేతికతను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
    మితిమీరిన టెక్నాలజీ వల్ల ఉద్యోగ భద్రతకు ప్రమాదం అనే వాదన తప్పు.
    ఉద్యోగ కల్పనలకు సాంకేతికత కొత్త మార్గాలను, అవకాశాలను సృష్టిస్తుంది.
    ఇటువంటి టెక్నాలజీ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అని వాటిని మనం దూరంగా పెట్టలేం. వాటిని నిలువరించే ప్రయత్నం చేసినా అది ఫలించదు.
  • బయోటెక్నాలజీని నేను ప్రమోట్ చేసినప్పుడు కూడా అనేక ప్రశ్నలు వేశారు. కానీ నాడు దాన్ని ప్రమోట్ చేయడం వల్లనే నేడు కోవిడ్ కు వ్యాక్సిన్ తీసుకురాగలిగారు.
    నేను విజనరీగా ఉండడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. కానీ నన్ను అప్పుడు అర్థం చేసుకోకపోవడం వల్ల రాజకీయంగా నష్టం జరిగింది.
    పాలసీల ద్వారా లబ్దిపొందిన వర్గాలు, ప్రజలు… సమాజానికి తిరిగి ఇవ్వడంలో భాగస్వాములు కావాలి.
    కానీ ఎందుకో, లబ్ది పొందిన ఆయా వర్గాలు ఆ మేరకు చొరవ చూపడం లేదు.
  • డిజిటల్ కరెన్సీ రావాలి అనేది నా బలమైన కోరిక. పెద్ద నోట్లను రద్దు చేయాలి. తద్వారా మనీ లాండరింగ్, బ్లాక్ మనీ సహా అన్నిటికీ చెక్ పడుతుంది.
    అప్పుడు ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా పేద ప్రజలపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టవచ్చు.
    సమర్థవంతమైన నాయకత్వంతోనే కుటుంబంలో అయినా, రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా మార్పు వస్తుంది.
    రాజకీయాల్లోకి మంచి వ్యక్తులు రావాలి. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలి.
    ఓటింగ్ పెరగడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. తద్వారా దేశానికి మంచి నాయకత్వం అందుతుంది. మంచి ఫలితాలు వస్తాయి.
  • పూర్ టు రిచ్ అనేది నా మనసుకు దగ్గరైన కార్యక్రమం.
    నాడు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ అనేది ఉంది. ఇప్పుడు నేను పీ-4 అంటున్నాను. అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అనేది రావాలి. సంపద సృష్టే కాకుండా దాన్ని అన్ని వర్గాలకు పంచేలా పాలసీలు ఉండాలి. తద్వారా పేదలు ధనికులుగా మారుతారు.
    పీ-4 వంటి విధానాలతో ఇండియా 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్ లేదా నెంబర్ టు దేశంగా నిలుస్తుంది.
  • పేదలకు అండగా నిలవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాలి. అందుకు అవసరమైన పాలసీలు ప్రభుత్వాలు తీసుకురావాలి. తద్వారా పేదరికం లేని సమాజం సిద్ధిస్తుంది.
    సాంకేతికత మిళితంగా వివిధ రంగాలకు సంబంధించి 10 పబ్లిక్ పాలసీలు తీసుకురావాలి.
    ఆరోగ్యం, విద్య, విద్యుత్, వ్యవసాయం, ఏఐ, ఐఓటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సర్వర్ పాలసీ వంటి రంగాల్లో కొత్త పాలసీల రూపకల్పన జరగాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement