Thursday, May 2, 2024

AP: సీఆర్‌డీఏ చట్ట సవరణపై పిల్‌.. ఈనెల 9న విచారణ

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపును సవాల్‌ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇదే అంశంపై మరో పిల్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యాలు బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావులతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చాయి. పిటిషనర్ల తరుపున సీనియర్‌ న్యాయవాది బీ ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

సీఆర్‌డీఏ చట్టంలో తాజా సవరణలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరుపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి జోక్యం చేసుకుంటూ ఇదే అంశంపై మరో వ్యాజ్యం దాఖలైందని దానిపై కూడా విచారణ జరపాలని ప ట్టుపట్టారు. ధర్మాసనం స్పందిస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి వ్యాజ్యంతో పాటు దీన్ని కూడా జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement