Monday, April 29, 2024

Pavani Latha – అవయవ దానంతో ఆమె చిరంజీవి…

కర్నూలు , ఫిబ్రవరి 06, ప్రభా న్యూస్ బ్యూరో. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవ దానం చేశారు. ఇది కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలోనే మొదటిసారనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఆసుపత్రి సూపర్డెంట్ తెలియజేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 5న బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేయబడిన కర్నూలు నగరానికి చెందిన గజ్జల పావని లత (28) అనే మహిళ అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేశారు..

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సమక్షంలో దానం చేసిన అవయవాలను హైదరాబాద్ కిమ్స్, విజయవాడ మణిపాల్ ఆస్పత్రులకు గ్రీన్ ఛానెల్స్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాహనాల్లో తరలించారు.. ఈ సందర్భంగా రహదారి వెంట వాహనాలను మరో మార్గాల గుండా తరలింపు చేశారు. మార్గం మొత్తం క్లియర్ అయిన తర్వాత వాహనాలు నిర్దేశిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి.. వాహనాలు వెళ్ళుటకు పోలీసులు ముందస్తుగా ట్రాఫిక్ ను పరిచోట్ల దారి మళ్ళించారు. మరి కొన్ని చోట్ల నిలిపివేశారు. దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్కు ఇబ్బంది తప్పలేదు. కాగా ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. విషయం తెలిసిన తర్వాత చాలామంది ఆసుపత్రి గొప్పతనాన్ని మెచ్చుకున్నారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సృజన మీడియా తో మాట్లాడుతూ జీవన్దాన్ లో రిజిస్టర్ చేసుకున్న వారి అవసరం మేరకు గజ్జల పావని లత కు సంబంధించిన ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రి కి , కాలేయాన్ని విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపించడం జరిగిందని తెలిపారు.. అదే విధంగా రెండు మూత్రపిండాలలో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఒకటి , కర్నూలు లోని కిమ్స్ ఆసుపత్రికి ఒకటి అందించడం జరిగిందన్నారు. కళ్ళను మాత్రం కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కి జీవన్దాన్ లో రిజిస్టర్ అయిన వారికి అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన మీడియా సమావేశం లో తెలియజేశారు

.కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిష్టాతులైన డాక్టర్ల సహాయంతో , ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని గజ్జల పావని లత కు చెందిన కొన్ని అవయవాలను పోలీసు వారి సహాయంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ , విజయవాడ మరియు కర్నూలు ఆసుపత్రులకు పంపించడం జరిగిందని తెలిపారు. పావని లత కోరిక మేరకు ఆమె తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చినందుకు కర్నూలు జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవయవదానం వల్ల బాధితులను ఆదుకోవడంతో పాటు చనిపోయిన వారిని బతికిఉన్నట్లు భావించవచ్చని కలెక్టర్ అభిప్రాయ పడ్డారు..

- Advertisement -

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి మాట్లాడుతూ, మానవ శరీరంలోని అవయవాలను దాదాపు ఎనిమిది మందికి ఉపయోగించు కోవచ్చునని వీటిలో చిన్న పేగులు , పెద్ద పేగులు , క్లోమంతో పాటు ఇతర భాగాలు కూడా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. భారత దేశంలో కొంతమంది మూఢనమ్మకాల వల్ల అవయవదానం చేయలేకపోతున్నారని, మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్గొన్న వైద్య సిబ్బందిని , రెడ్ క్రాస్ సిబ్బంది , పోలీసులను అభినందించారు.కార్యక్రమంలో ఆసుపత్రి

కార్డియో థోరాసిక్ సర్జన్ ప్రభాకర్ రెడ్డి , కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement