Monday, April 29, 2024

Open Letter – దొంగ ఓట్లపై తాతకు మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ

తిరుపతి ( రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : “చంద్రగిరి నియోజకవర్గం లో లక్ష దొంగ ఓట్లు చేర్చామని ఏమాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం మా తాత మిత్రులైన, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మీకు తగదు. ఈ విషయం నిరూపిస్తే నేను నామినేషన్ కూడా వేయను. ఈ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా ” అని చంద్రబాబు కు బహిరంగ లేఖ రాస్తున్నట్టు తుడా ఛైర్మెన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రకటించారు.

ఈ రోజు సాయంత్రం తిరుపతి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖను పంపినట్లు వెల్లడించారు. ఆ సందర్బంగా మోహిత్ మాట్లాడుతూ లేఖ ను చదివి వివరించారు.

ఆ లేఖలో…..

పెద్దలైన చంద్రబాబు తాత మీరు, మా తాత ఇద్దరు కలిసి చదువుకున్నారు, కావున మీరు నాకు తాత లాంటి వారు, నా వయసు 25 సంవత్సరాలు, చంద్రబాబు తాత మీరు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్ళయింది, మీరు రాజకీయాల్లోకి వచ్చిన 20 ఏళ్ళకు నేను పుట్టాను. ఈ రోజు చంద్రబాబు తాత మీరు పెట్టిన ప్రెస్మీట్. ఎన్నికల కమీషన్కు చేసిన ఫిర్యాదు చూసి ఆశ్చర్యపోయాను. ఇంత అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడైన మీరు కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా, ఈ రోజు ఎన్నికల కమీషన్కు చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేశారని ఫిర్యాదు చేయడం, ప్రెస్ మీట్ పెట్టి ఆవాస్తవాలు మాట్లాడడం చాలా బాధాకరం.

ఇంత అపార రాజకీయ అనుభవమున్న రాజకీయ నాయకుడైన మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతారని నేను నా కలలో కూడా ఊహించలేదు.2019 ఎన్నికల్లో చంద్రబాబు తాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రగిరిలో మొత్తం ఓట్లు 2,91,734. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3,08,672 మాత్రమే. కేవలం ఈ ఐదు సంవత్సరాలలో పెరిగింది. కేవలం 16 వేలు మాత్రమే. ఈ ఐదు సంవత్సరాలలో చంద్రగిరి నియోజకవర్గంలో సహజంగా కట్టుకునే కొత్త ఇళ్ళే కాకుండా, మా చంద్రగిరి నియోజకవర్గంలోని ఒక్క తిరుపతి రూరల్ మండలంలోనే ఈ ఐదేళ్ళలో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లు మొత్తం 160, అందులో ఉన్న ప్లాట్లు 5,200. ఇన్ని కొత్త ఇళ్ళ నిర్మాణం జరిగినప్పుడు 16,000 ఓట్లు కూడా కొత్తగా నమోదు కాకుండా ఎలా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించమని చంద్రబాబు తాతను విజ్ఞప్తి చేస్తున్నాను.

నిజంగా లక్ష దొంగ ఓట్లు చేరిస్తే 3,91,000 కావాలి కానీ 3,08,672 మాత్రమే ఎందుకుంటాయి చంద్రబాబు తాతా ఒక్కసారి ఆలోచించు.మా తాత వయసున్న మిమ్మల్ని విమర్శించేంత స్థాయి నాది కాదు, కానీ నిజాలు తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడడం మీ వయసుకు కూడా తగదని మీ మనవడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2023 నవంబర్ నెలలో కేవలం 4 రోజుల్లో టీడీపీ వారు 14,200 దొంగ ఫారం 7 లు నింపి దరఖాస్తు చేశారు. ఎన్నికల కమీషన్ విచారణ చేస్తే చాలామంది టీడీపీ వారు అరెస్ట్ అవుతారు. ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను తాతా…అసత్య ఆరోపణలు చేసిన అందరిపైనా పరువు నష్టం దావా వేస్తున్నాను. న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాను, చంద్రగిరి ప్రజల ముందు కూడా దోషులుగా నిలబెడతాను. అప్పటివరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నాను.

- Advertisement -

వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి అసత్యాలే ఇంకా కూడా మీరు కొనసాగిస్తే… నేను మా నియోజకవర్గ ప్రజలతో కలిసి పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనకాడనని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు సీఎంగా ఉన్నప్పుడే మా నాన్న 43 వేల మెజార్టీతో గెలిచారు. అలాంటి మాకు దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం లేదు. మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులుగా ఎప్పుడూ చూడరు. తమ కుటుంబ సభ్యులుగా చూస్తారు.చివరిగా చంద్రబాబు తాతా…మిమ్మల్ని మనసారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే… మీరు ఎప్పుడూ కూడా మీ వయసుకు, మీ అనుభవానికి తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నాను.అని లేఖ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement