Saturday, May 11, 2024

ప‌ద్దు మారింది – జీతం ఆగింది..

అమరావతి,ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక నిధులతో నిర్వహిస్తున్న ఆయా శాఖల ఉద్యోగుల జీతాల పద్దు 010 నుంచి తప్పించి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ లోకి మార్చడంతో జిల్లాల్లో వేల మందికి నేటికీ జీతాలు అందని పరిస్థితి నెలకొంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 80 శాతం కేంద్రం నిధులు కేటాయిస్తుంటే.. తన వాటా 20 శాతం కలిపి ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీ-వల స్వస్తి పలికింది. 2022-23 ఆర్థిక సంవత్సరం గత మార్చి నెలతో ముగిసింది.

ఆర్థిక శాఖ అధికారులు సీఎఫ్‌ఎంఎస్‌ లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత నిధులతో నిర్వహిస్తున్న ఐసీడీఎస్‌, వైద్యారోగ్య శాఖ, మున్సిపల్‌, సర్వశిక్ష అభియాన్‌, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలను 010పద్దు నుంచి తప్పించి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 310/312 పద్దు లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణం గా మార్చి నెల జీతాల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో పెట్టేందుకు వీలు కాలేదు. దీంతో ఆయా శాఖల ఉద్యోగు లకు ఏప్రిల్‌ 12వ తేదీ వచ్చినా జీతాలు పడలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులతో ఆయా శాఖల కార్యక్రమా లను అమలు చేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు నుంచి జీతాలు చెల్లిస్తూ వచ్చారు. నిధుల లభ్యతను దృష్టిలో పెట్టు-కుని ఆయా నెలల్లో 1వ తేదీ నుంచి వేతనాలు జమ చేస్తుంటారు. దీనివల్ల కొందరికి ముందు.. మరికొందరికి తర్వాత రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు తొలి ప్రాధాన్యంలో వేతనాలకు బడ్జెట్‌ కేటాయిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులతో నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీ-లను 010 పద్దు నుంచి 310/312 పద్దులోకి మార్చడంతో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ జాబితాలోకి చేరాయి. దీనివల్ల ఆయా శాఖల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందుబాటు-లో ఉన్నప్పుడు త్రైమాసిక కాలానికి బడ్జెట్‌ కేటాయించనుంది. దాంతో ఏడాదిలో మూడు నెలలకోసారి చొప్పున నాలుగు విడతల్లో బడ్జెట్‌ కేటాయించే అవకాశముంది. దీనివల్ల ఉద్యోగులకు నెల నెలా జీతాలు వచ్చే పరిస్థితి లేదు.

రాష్ట్రంలోని 26భిల్లాల్లో 385 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 55 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి కార్యకర్త, సహాయకురాలు చొప్పున సుమారు 1.10 లక్షల మంది ఉన్నారు. వీరితో పాటు- ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవోలు, క్లస్టర్ల సూపర్‌వైజర్లు, మంత్రాంగ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బంది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, సర్వశిక్ష అభియాన్‌, సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని కూడా 310/312 పద్దులోకి మార్చడంతో సీఎఫ్‌ఎంఎస్‌ జాబితా నుంచి తప్పించినట్లయింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 25 వేల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. 010 పద్దు నుంచి తప్పించి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దులోకి మార్చడంతో ప్రభుత్వం త్రైమాసిక కాలానికి బడ్జెట్‌ కేటాయించిన తర్వాత -టె-జరీలతో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేయనున్నారు. దీనివల్ల ఏ నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. కుటు-ంబాల ఖర్చులు, పిల్లలకు పాఠశాల, కళాశాలల్లో ఫీజులు, ఇతర ఖర్చులకు చేతిలో డబ్బులు ఉండే అవకాశం లేదు. ప్రైవేటు- వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి ఉంటు-ందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నారు..ఎం.ఎన్‌.మూర్తి, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా నాయకుడు
అంగన్‌వాడీ సిబ్బందితో సమానంగా ఉద్యోగులను కూడా 010 పద్దు నుంచి 310/312 పద్దులోకి మార్చడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ నెలకు సంబంధించిన జీతం తర్వాతి నెల 1, 2వ తేదీల్లో వస్తేనే అప్పుల వాళ్లకు చెల్లించి ప్రశాంతంగా ఉండగలరు. మార్చి నెల జీతం ఇప్పటికీ రాలేదు. గతంలో మాదిరిగానే 010 పద్దులోకి మార్చితేనే ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు అందే పరిస్థితి ఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement