Monday, April 29, 2024

ఆర్జిత సేవల ధరల పెంపుపై టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన

ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని తెలిపారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. విఐపి దర్సనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పదిరోజులవుతోందన్నారు. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని తెలిపారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని చెప్పారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని ప్రకటించారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని తెలిపారు. త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టిటిడికి లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement