Wednesday, May 15, 2024

పలుగుపట్టిన యువనేత నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి పలుగు పట్టి తవ్వారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. ఆదోని నియోజకవర్గం పెద పెండేకల్ శివారు ఎర్రచెరువువంకలో ఉపాధి హామీ కూలీలను యువనేత కలిశారు. కూలీల వద్ద ఉన్న గడ్డపార తీసుకొని మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే రూ.150ల కూలీ ఇస్తున్నారు. ఎండపొద్దున నీడకోసం కనీసం పరదా పట్టలు, మంచినీళ్లు కూడా ఏర్పాటుచేయడం లేదన్నారు. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడిస్తున్న కూలీ ఏ మూలకూ సరిపోవడం లేదని తెలిపారు. పనిదినాలు, కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలి. మంచినీళ్లు, నీడ సౌకర్యం కల్పించాలి. గ్రామాల నుంచి పనిచేసే ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.261 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్రమే చెప్పిందన్నారు. ఉపాధి హామీ పథకంలో పేదల కష్టాన్ని వైసీపీ నాయకులు మింగేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి పనులు చేసే పేదల కోసం నీడ ఏర్పాటు చేయడమే గాక ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో మజ్జిగ కూడా అందించామన్నారు. ఉపాధి పనుల కోసం గడ్డపారలు ఇవ్వడమేగాక, దూరాన్ని బట్టి అదనపు కూలీ చెల్లించామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పనిదినాలు, కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement