Sunday, April 28, 2024

మంచి చెబితే విషం క‌క్కుతారా…వైసిపి నేత‌ల‌పై నాగ‌బాబు ఫైర్

అమ‌రావ‌తి – మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ మంత్రులు వరుసబెట్టి విమర్శలు గుప్పిస్తుండటంపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు మండిపడ్డారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అణా పైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ అని ఆయన అన్నారు. ఏ పనీ లేనోడు పిల్లి తల గొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు అని మండిపడ్డారు. ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుందని అన్నారు.

వైసిపి మంత్రుల గురించి నాగ‌బాబు మాట్లాడుతూ, మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదు అని విమర్శించారు. బటన్ నొక్కి, కోట్లల్లో ముంచి, వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో, అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుందని అన్నారు. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉందని చెప్పారు. కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుందని, ఆరోగ్యాలు జాగ్రత్త అని హెచ్చరించారు. ,

Advertisement

తాజా వార్తలు

Advertisement