Sunday, April 28, 2024

KNL: తుంగభద్ర నదిపై నాగలదిన్నె వంతెనను ప్రారంభించిన మంత్రి బుగ్గన

కర్నూలు : మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు కీలకమైన నాగలదిన్నె వంతెనను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో రూ.42కోట్లతో నిర్మించిన నాగలదిన్నె హైలెవెల్ వంతెన నిర్మాణం ఎమ్మిగనూరు ప్రజలకోసం చేసిన శాశ్వత అభివృద్ధిగా మిగులుతుందని మంత్రి పేర్కొన్నారు. నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పడ్డ శ్రమ, తపన మాటల్లో చెప్పలేనిదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 2009లో కర్నూలు వరదల వల్ల పాత వంతెన కొట్టుకుపోయిన తరుణంలో 2011లో కొత్త వంతెనను నాటి ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.

అనేక కారణాల వల్ల బ్రిడ్జి నిర్మాణానికి పదేళ్ల కాలం పట్టినా ఎట్టకేలకు పట్టువదలకుండా ఎన్ని అవాంతరాలొచ్చినా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రజలకు ఎంతో అవసరమైన ఈ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే అడగ్గానే అంగీకరించిన విషయాన్ని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. త్వరలోనే తుంగభద్ర నదికి అవతల ఉన్న రహదారిని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. పాత వంతెనతో పోల్చితే ఎత్తు, పొడవు, సామర్థ్యవంతంగా భవిష్యత్ లో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా నిర్మించినట్లు ఆయన తెలిపారు.

వంతెనలు, రహదారులు, భవన నిర్మాణాల వంటి శాశ్వతంగా నిలిచిపోయే పనులకు సీఎం ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తమ ప్రాంతానికి విచ్చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు స్థానిక ప్రజలు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గుమ్మళ్ల సృజన, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సర్పంచ్ లక్ష్మి, ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజు, ఈఈ కృష్ణా రెడ్డి, జడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement