Friday, April 26, 2024

సీఎం జగన్ ది సాహోసేపేత నిర్ణయం: మండలి చైర్మన్

రాజకీయాల్లోకి రాణించాలంటే డబ్బు, కులం అవసరం లేదని ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మోషేన్ రాజు అన్నారు. తనను ఛైర్మన్ ను చేయడం సీఎం జగన్ తీసుకున్న సాహోసేపేత నిర్ణయం అని అభివర్ణించారు. పేద, వ్యవసాయ, దళిత కుటుంబానికి చెందిన తనను మండలి ఛైర్మన్ గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికకావడానికి సహకరించిన అధికార, ప్రతిపక్ష సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.  రాజకీయాల్లో ఈ స్థానానికి వస్తానని ఊహించలేదన్నారు. రాజకీయాల్లో పైకి రావాలంటే డబ్బు, కులం, రాజకీయ నేపథ్యం అవసరమని అందరూ ఎలా భావిస్తారో.. నేను కూడా అలానే భావించే వాడినని.. నాకు ఈ పదవి వచ్చిన తర్వాత అవన్నీ అవసరం లేదన్నారు. విశ్వాసం, నమ్మకం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే చాలని అన్నారు. తనను చూసి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చన్నారు. వైఎస్సార్ కుటుంబానికి దగ్గరగా ఉండాలని పరితపిస్తూ ఉండేవాడినని.. 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి పిలిచి ధైర్యం చెప్పారన్న మోషేన్ రాజు.. తాను ముఖ్యమంత్రి అయ్యాను.. నిన్ను కూడా అసెంబ్లీకి తీసుకొస్తానని చెప్పారన్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే చాలు ఆనాడు చెప్పానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

2009లో సీఎం జగన్ తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని తెలిపారు. దాని అర్థం ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. తనను శాసనమండలి సభ్యున్ని చేయడంతో పాటు ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్ప మరెవరూ ఇంత సాహోసేపేత నిర్ణయం తీసుకోలేరన్నారు.  ఛైర్మన్ గా నియమించినందుకు రెండింతల నమ్మకంగా పనిచేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించే దిశలో  ప్రతిపక్షాలకు ఒక వంతు ఎక్కువే అవకాశం ఇస్తానని తెలిపారు. అయితే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేసే అభివృద్ది, సంక్షేమ పథకాలను గుర్తించి మాట్లాడాలని సూచించారు. తనపై నమ్మకంతో ఛైర్మన్ గా ఎంపిక చేసినందుకు సమవర్థంగా పనిచేసి గౌరవం నిలబెడతానన్నారు. దళితుల ఆత్మగౌరవం కాపాడి మంచి పేరు వచ్చేలా పనిచేస్తామని మోషేన్ రాజు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement