Sunday, May 5, 2024

AP: డోన్ లో కేంద్రీయ విద్యాలయం.. కేంద్ర గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి కర్నూల్ జిల్లా (డోన్) : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కృషితో దశాబ్దాల తర్వాత డోన్ మండలానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాన్ని డోన్ పట్టణంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డోన్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలు కమిటీ ఆమోదం తెలిపింది. ఉచితంగా స్థలం, తరగతుల ప్రారంభానికి తాత్కాలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చే ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని ఎక్స్ పెండిచర్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హేమ జైస్వాల్ పేరు మీద అందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడ్డాయి.

దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 8 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి లభించింది. నంద్యాల జిల్లాలోని డోన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసలపల్లె గ్రామం, గుంటూరు జిల్లా మాచర్ల మండలం పాలసముద్రం గ్రామం, కృష్ణా జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా నరసరావు పేట డివిజన్ కేంద్రంగా రొంపిచర్ల, ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం విద్యాలయాలను మంజూరు చేసింది. ఇప్పటికే ఆయా గ్రామాల పరిధిలో స్థల సేకరణ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులు వేలాది మంది సీబీఎస్ఈలో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement