Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టెన్ష‌న్ – జ‌గ‌న్ టార్గెట్ 7, చంద్ర‌బాబు ల‌క్ష్యం వ‌న్…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీ, విపక్ష టీడీపీకి పెను సవాల్‌గా మారాయి. ఏడు స్థానా లకు జరుగుతున్న ఎన్నికల్లో ఆరు స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. మిగిలిన ఆ ఒక్క స్థానా న్ని సొంతం చేసుకుని తన పట్టు నిలుపుకోవాలని అధికార పక్షం పావులు కదుపుతుండగా, కీలకమైన ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని పట్టభద్రుల తరహాలోనే తన పట్టును నిలుపుకోవాలని టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఈనెల 23వ తేదీ జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ విప్‌ జారీ చేయగా వైసీపీ కూడా ఆదిశగానే అడుగులు వేస్తున్నది. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తించి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదే అంశాన్ని ఇంటిలిజెన్స్‌ వర్గాలు కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చేరవేసినట్లు తెలుస్తుంది. దీంతో ఏడో స్థానం చేజారిపోకుండా ఉండేందుకు సీఎం జగన్‌ రంగంలోకి దిగారు. టీడీపీకి టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో ఆరా తీసే పనిలో పడ్డారు. అందుకోసం గత రెండు రోజులుగా ఆయన ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించి ఎలాగైనా ఏడో స్థానాన్ని గెలిచి తీరాలని ముఖ్య నేతలకు సూచిస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా రంగంలోకి దించిన అభ్యర్ధి పంచుమర్తి అనూరాధను గెలిపించి మండలికి పంపాలని పట్టుదలతో ఉంది. దీంతో ఇరు పార్టీల్లోనూ 23వ తేదీ టెన్షన్‌ కనిపిస్తుంది.

ఆ ఒక్క స్థానంపైనే ఇద్దరి గురి
ఎమ్మెల్సీ కోటాలో పోటీచేస్తున్న అభ్యర్దులు గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. ఆలెక్కన వైసీపీకి ఆరు స్థానాలు సునాయాసంగా దక్కుతాయి. ఏడో స్థానానికి కూడా జనసేన, టీడీపీ నుండి పరోక్షంగా మద్దతిస్తున్న నలుగురు సభ్యులతో గెలిచే అవకాశం ఉంది. అయితే, అధికార వైకాపా నుండి ఇద్దరు సభ్యులు దూరం జరిగారు. దీంతో ఇప్పుడు ఈ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. అధికార వైసీపీకి 151 స్థానాలు ఉండగా, టీడీపీకి 23, జనసేనకు 1 వంతున సభ్యులు ఉన్నారు. అయితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నలుగురు సభ్యులు గత కొంత కాలంగా సీఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా అదే దారిలో ఉన్నారు. దీంతో వైపీపీ బలం 156కు చేరగా, టీడీపీ బలం 19కు పడిపోయింది. ఈక్రమంలోనే వైసీపీ నుండి ఇద్దరు సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి దూరం జరడంతో వైకాపా బలం 154కు పడిపోయింది. ఈలెక్కన కూడా ఏడో స్థానం నూటికి నూరు శాతం వైకాపా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, 20 మందికిపైగా శాసనసభ్యులు టీడీపీకి టచ్‌లో ఉన్నారని, వారిలో కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా సిద్దమయ్యే అవకాశాలున్నాయన్న సమాచారం. దీంతో సీఎం జగన్‌ అప్రమత్తమయ్యారు.

రంగంలోకి చంద్రబాబు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ అభ్యర్ధి మూడు స్థానాల్లో గెలుపొందారు. దీంతో ప్రధాన ప్రతిపక్షంలో జోష్‌ పెరిగింది. ఇదే సందర్భంలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో స్థానంపై చంద్రబాబు గురిపెట్టారు. అందుకోసం రంగంలోకి దిగి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏడో స్థానం గెలవాలంటే 22 మంది సభ్యుల బలం కావాలి. అధికారికంగా టీడీపీకి 23 మంది సభ్యులున్నారు. వారిలో నలుగురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఆ సంఖ్య 19కి పడిపోతుంది. ఇటీవల వైకాపాపై తిరుగుబాటు చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ బలం 21కి పెరుగుతుంది. అయినా కూడా మరో సభ్యుని ఓటు టీడీపి అవసరం ఉంది. ఈనేపథ్యంలో గత కొంతకాలంగా అధికార వైకాపాపై తీవ్ర అసంతృప్తితో తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్న కొంత మంది వైకాపా ఎమ్మెల్యేలను ఏడో స్థానం గెలుపుకోసం ఉపయోగించుకోవాలని బాబు వ్యూహ రచన చేస్తున్నారు. ఆదిశగానే వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అలా జరగకుండా
అయితే, సభ్యులు కూడా తెలివిగా వ్యవహరించే పరిస్థితి ఉందని ఇటు వైకాపా, అటు తెదేపా ముందస్తు ఆలోచనలు చేస్తున్నాయి. ఇరుపార్టీలు విప్‌ జారీచేసిన సందర్భంలో ఓటింగ్‌కు హాజరై చెల్లకుండా ఓటేస్తే వచ్చే ప్రమాదాన్ని కూడా వారు ముందుగానే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సభ్యులు ఓటింగ్‌కు హాజరై ఓటు చెల్లకుండా వేస్తే ఏపార్టీకి నష్టం వాటిల్లుతుందన్న దానిపై ఎవరికివారే లెక్కలేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు ఓటు చెల్లకుండా వేస్తే పరిస్థితి ఏంటి..అలాగే వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా ఓటు చెల్లకుండా వేస్తే ఎదురయ్యే పరిస్థితులేంటన్న దానిపై ఇరు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈక్రమంలోనే సీఎం జగన్‌ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతన్నారు. ఇదే విధానాన్ని తెదేపా కూడా అనుసరిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement