ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడింది. ఆదివారం ఉదయానికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి శనివారానికి వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 1,270 కి.మీ.. పూరీకి 1,300 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ఈ నెల 10 వరకు వాయువ్య దిశగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 10, 11న ఉత్తర కోస్తాలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి చెప్పారు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. ఇటు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.