Friday, May 3, 2024

విజయవాడలో అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ సెంటర్‌.. ఈ నెల 24 నుండి ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ సూచనలు, అనుమతుల మేరకు ఈ నెల 24 నుండి విజయవాడ సిద్ధార్ధ వైద్య కళాశాల (రామవరప్పాడు) ఆవరణలో అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ సెంటర్ను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్‌ జె నివాస్‌ తెలిపారు. ముందుగా అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న యెల్లో ఫీవర్‌ వ్యాక్సినేషన్తో ప్రారంభించి క్రమంగా అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వ్యాక్సిన్లను ఇక్కడ అందుబాటులో వుంచుతామని ఆయన వివరించారు. ప్రస్తుతం మన దేశంలో యెల్లో ఫీవర్‌ లేనప్పటికీ సెంట్రల్‌ ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుండి వచ్చే పర్యాటకుల వల్ల ఈ ప్రమాదకర వ్యాధి మన దేశంలో ప్రవేశించటానికి అవకాశం వున్నందున, ఈ దేశాల నుండి మన దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చే వారికి వ్యాక్సినేషన్‌ తీసుకోవటాన్ని తప్పనిసరి చేశామన్నారు.

యెల్లో ఫీవర్‌ ప్రమాదకరమైన వైరల్‌ హెమరేజ్‌ వ్యాధి అని ఏడిస్‌ ఈజిప్టి అనే దోమల ద్వారా వ్యాపిస్తుందని ఆయన వివరించారు. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా సోకినవారిలో ఎటువంటి వైద్య చికిత్సా అందని పక్షంలో దాదాపు 50 శాతం మంది మృత్యువాత పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్‌కు వ్యతిరేకంగా 17డి వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని, జీవిత కాలం ఈ వైరస్‌ నుండి రక్షణ కల్పించేందుకు ఒక్క డోస్‌ వేసుకుంటేసరిపోతుందన్నారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం కోడిగుడ్లు, చికెన్‌ ప్రోటీన్‌, లేదా జెలాటిన్‌ పట్ల ఎలర్జీ వుండేవారు, గతంలో యెల్లో ఫీవర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత తీవ్రమైన ఎలర్జిక్‌ రియాక్షన్‌కు గురైన వారు, (మీకు ఇటువంటి ఎలర్జీలేవైనా వుంటే ముందుగా డాక్టర్‌ తెలియచేయాలి) గర్భిణులు, త్వరలో గర్భధారణకు సిద్ధమయ్యే వారు, 9 నెలలలోపు చిన్నారులు, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ ఇన్ఫెక్షన్‌ కలిగిన వారు, క్యాన్సర్‌ లేదా ఇతర వైద్యపరమైన పరిస్థితులతో వ్యాధినిరోధక శక్తి తగ్గిన వారు, తీవ్రమైన అస్వస్థతకు గురైన వారు పూర్తి స్వస్థత చేకూరే వరకూ ఈ వ్యాక్సిన్‌ తీసుకోవటాన్ని వాయిదా వెయ్యాలని ఆయన సూచించారు. అదే విధంగా థైమస్‌ సమస్యలు వున్న వారు, తీవ్రమైన లివర్‌, కిడ్నీ సమస్యలున్న వారు కూడా ఈ వ్యాక్సిన్‌ తీసుకో కూడదని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ అవసరమైన వారు వైఎఫ్‌సీఎస్‌ఎంసీజీజీహెచ్‌ ఎట్‌దిరేట్‌ ఆఫ్‌ జీమెయిల్‌ డాట్‌కామ్‌ కు ఇ-మెయిల్‌ చిరునామాకు పాస్‌పోర్ట్‌ ఫొటోను అప్లోడ్‌ చేస్తే వారి ఇ-మెయిల్‌ మొబైల్‌ నెంబర్‌ వాట్సాప్‌కు అప్పాయింట్మెంట్‌ ఇస్తారన్నారు.

సాధారణంగా మంగళవారం ఉ దయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఈ అపాయిం-టె-్మంట్‌ స్లాట్లు- వుంటాయని ఆయన తెలిపారు. విద్యార్థులు, అత్యవసర ప్రయాణాలున్న వారు, వ్యాక్సినేషన్‌ కోసం తత్కాల్‌ పద్ధతిలో అన్ని పనిదినాలలో కనీసం ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు వంతున అపాయింట్‌ మెంట్‌ తీసుకోవచ్చని తెలిపారు. అపాయిం-టె-్మంట్‌ కోసం 8978633599కు వాట్సప్‌ చేస్తే అందుకు అనుగుణంగా అపాయిం-టె-్మంట్‌ నిర్ధారిస్తామన్నారు. మెెయిల్‌, వాట్సప్‌ ద్వారా అపాయిం-టె-్మంట్‌ నిర్ధారణ అయిన తరువాత ఫీజు చెల్లింపు వివరాలు పంపుతామని నివాస్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement