Friday, May 17, 2024

కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌లు.. మెరుగైన పాల‌న‌కు చ‌ర్య‌లు: ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 3వ తేదీ దాకా సూచనలు తీసుకుంటామ‌న‌ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 3 వరకు జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇవ్వొచ్చని, వ‌చ్చే విజ్ఞ‌ప్తుల‌ను అన్నింటినీ పరిశీలించాలని సీఎం జగన్‌ ఆదేశించిన‌ట్టు చెప్పారు. ఆ త‌ర్వాత మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కాగా, ఏప్రిల్ 2వ తేదీ నుంచి అంటే.. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభమవుతుందని, దీనికి గాను మార్చిలోనే అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపట్ట‌నున్న‌ట్టు తెలిపారు.

ఇక‌.. ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శ విజ‌య్‌కుమార్‌. దీనికి గాను వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయించ‌నున్న‌ట్టు తెలిపారు. రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు ఉంటాయ‌ని, వాటిని కూడా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌లు నిర్మిస్తామ‌ని తద్వారా అన్ని ఆఫీసులు ఒకేచోట ఉండ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లో ప‌నులు పూర్తిచేసుకునే వెస‌లుబాటు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేయ‌నున్నట్టు తెలిపారు. దీనికి గాను 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్‌లు నిర్మాణం జరుగుతుందన్నారు. జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తామ‌ని, అయితే జిల్లాల ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరం ఉండ‌ద‌ని చెప్పారు. జిల్లాలను ఏర్పాటు చేసి కేంద్రానికి పంపిస్తే నోటిఫై చేస్తుందని.. ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement