Thursday, May 9, 2024

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల పరిశీలన.. గడువుకు ముందే పూర్తి చేయాలని ఆదేశాలు..

అమరావతి,ఆంధ్రప్రభ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ పనులు నిర్ణీత సమయానికంటే ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. అంబేద్కర్‌ జయంతి వరకూ ఆలస్యం చేయకుండా ముందస్తుగానే పూర్తి చేయాలని చేసేందుకు అవసరమైన చర్యలు తీఉకోవాల్సిందిగా సూచించారు. రాష్ట్ర మంత్రులు, అధికారులతో కూడిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు కమిటీ మంగళవారం తాడేపల్లిలోని ఎస్సీ గురుకులం ప్రధాన కార్యాలయంలో సమీక్షను నిర్వహించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరు కాగా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మేరుగు నాగార్జున మాట్లాడుతూ, రాబోయే అంబేద్కర్‌ జయంతి నాటికి 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అంబేద్కర్‌ జయంతి అంటే ఏప్రిల్‌ 14 వరకూ గడువు ఉంది కదా అని విగ్రహనిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా ఈ గడువుకు ముందుగానే విగ్రహ ఆవిష్కరణ పనులను శీఘ్రగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఏపీఐఐసీ అధికారులు ఈ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట అడ్డుగా ఉన్న భవనాలను తొలగించే పనులు పూర్తి చేయడంలోనూ ఆలస్యం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్‌ విగ్రహంలో అణువణువూ సహజత్వం ఉట్టి పడేలా రూపొందించాలని, అంబేద్కర్‌ ముఖాకృతి తీర్చిదిద్దే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆదిమూలం సురేష్‌ మాట్లాడుతూ, అంబేద్కర్‌ విగ్రహానికి సంబంధించి 12.5 అడుగులు, 25 అడుగుల నమూనా విగ్రహాల్లో కమిటీ సూచించిన మార్పులన్నీ చేయాలని సూచించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు ను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని, ఈ విగ్రహం పెడుతున్న చోట భవనాల తొలగింపు విషయంలో సమస్యలు ఉంటే వాటిని కమిటీ దృష్టికి తేవాల్సిందిగా సూచించారు. అంబేద్కర్‌ విగ్రహం ముఖాకృతిని 125 అడుగుల సైజులో ఉండే విధంగానే ముందుగా మట్టితో నమూనా విగ్రహాన్ని తయారు చేసి చూపిస్తామని, అందులో ఒకవేళ మార్పులు సూచిస్తే వాటిని కూడా చేసి ఆ తర్వాత మైనంతో నమూనా రూపొందిస్తామని, అనంతరం కాంస్య విగ్రహం తయారీని ప్రారంభిస్తామని విగ్రహశిల్పి నరేష్‌ కుమార్‌ ఈ సందర్భంగా చెప్పారు. మట్టితో చేసే నమూనా విగ్రహాన్ని చూడడానికి మంత్రుల బృందం ఢిల్లీలోని తమ స్టుడియోకు రావాల్సి ఉంటుందన్నారు. దీంతో అసలు సైజులో తయారు చేసే నమూనా విగ్రహాన్ని చూడటానికి ఢిల్లీ వెళ్లాలని మంత్రులు నిర్ణయించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌, డైరెక్టర్‌ హర్షవర్ధన్‌, తో పాటు గా ఎపీఐఐసి, కేపీసీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు వర్చువల్‌ గా ఈ సమావేశానికి హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement