Friday, May 17, 2024

ఆగస్ట్‌ 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్లు, ఆరోగ్యశ్రీ చికిత్సల జాబితా మరింత పెంచండి: సీఎం జగన్

అమరావతి, ఆంధ్రప్రభ: ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్స్‌ కాన్సెప్ట్‌ను అందుబాటు-లోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదెశించారు ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానం చేయాల్సిందిగా సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1059 ప్రొసీజర్స్‌కు మాత్రమే చికిత్స అందించేవారని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారుచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

డబ్బులు అడిగితే ఏసీబీకి ఫిర్యాదు..

ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి, అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపు అయ్యేలా చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం సూచించారు. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూంన్త తర్వాత ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నారు. ధృవీకరణ పత్రంలో వైద్యంకోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు. అలాగే రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు పొందుపర్చాల్సిందిగా సూచించారు. రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా? పూర్తి ఉచితంగా వైద్యం అందిందా? అన్న విషయాలను కూడా ధృవీకరించేలా పత్రం ఉండాలన్నారు. ఎవరైనా లంచం లేదా అదనపు రుసుము వసూలు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదులకోసం ఏసీబీకి కేటాయించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104 ఉంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రోగి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిమీద విచారణ చేయాలన్నారు. మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలన్నారు. రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాల్సిందిగా సీఎం పేర్కొన్నారు. 108, 104 లాంటి సర్వీసుల్లో కూడా లంచాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఈ వాహనాలపైన ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉంచాల్సిందిగా సూచించారు.

అదుపులో కోవిడ్‌..

రాష్ట్రంలో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉన్నట్లు సీఎంకు సంబంధిత అధికారులు వివరించారు. అక్కడక్కడా కోవిడ్‌ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతిస్వల్పమని అధికారులు తెలిపారు. కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని, వీరందరూ కూడా కోలుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్‌ డోసు వేశామన్నారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69శాతం మందికి ఇచ్చామని, 12 – 14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామని అధికారులు వివరించారు.

- Advertisement -

ఖాళీలను భర్తీ చేయండి..

ఈ నెలాఖరు నాటికి వైద్యశాఖలో సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. వైద్యసేవలకు సంబంధించి ఎక్కడా కూడా లోటు పాట్లు రానీయొద్దన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేంతోనే భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని, దాంట్లో భాగంగానే ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించడంతోపాటు-, నాణ్యమైన మందులను అందుబాటు-లో ఉంచడం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు పై చేపట్టిన పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 16 మెడికల్‌కాలేజీల్లోని 14 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నర్సీపట్నంలో కూడా ఈనెలాఖరునుంచి పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటు-న్నామన్నారు. మెడికల్‌ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్‌ నవీన్‌ కుమార్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్‌, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపి కమిషనర్‌ వి వినోద్‌కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌(డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement