Thursday, April 25, 2024

రికార్డు సృష్టిస్తోన్న.. తిరుమ‌ల శ్రీవారి హుండీ ఆదాయం

తొమ్మిదో నెల తిరుమ‌ల శ్రీవారి హుండీ ఆదాయం 100కోట్ల రూపాయ‌లు దాట‌డం విశేషం. ఈ వార్షిక సంవత్సరంలో అంటే మార్చి 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు హుండీ ద్వారా రూ. 1000 కోట్ల ఆదాయం వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేసింది. ఇప్పుడు అంచనాలకు మించి ఆదాయం వచ్చి పడుతోంది. మార్చి నుంచి నవంబరు వరకు ప్రతి నెల రూ. 100 కోట్లకుపైగా ఆదాయం హుండీ ద్వారా సమకూరుతోంది. గత 8 నెలల్లో రూ. 1,164 కోట్ల ఆదాయం రాగా, నవంబరులో ఏకంగా రూ. 127.30 కోట్ల ఆదాయం వచ్చింది.

ఫలితంగా టీటీడీ వార్షిక ఆదాయ అంచనాను దాటేసింది. దీంతో టీటీడీ తన అంచనాలను సవరించింది. ఈ వార్షిక సంవత్సరంలో రూ. 1600 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని భావిస్తోంది. 1950 వరకు శ్రీవారికి హుండీ ద్వారా రోజుకు లక్ష రూపాయల లోపు ఆదాయం లభించేది. 1958లో తొలిసారి లక్ష దాటింది. 1990ల నాటికి అది కోటి రూపాయలకు పెరగ్గా, ఆ తర్వాతి నుంచి క్రమంగా పెరిగింది. 2020-21లో రూ. 731 కోట్ల వార్షిక ఆదాయం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో అది మరింత పెరిగి రూ. 933 కోట్లకు పెరిగింది. దీంతో ఈ వార్షిక ఏడాదిలో అది రూ. 1000 కోట్లు అవుతుందని అంచనా వేయగా, మూడు నెలల ముందే ఆ అంచనా దాటిపోయింది. దీంతో ఈసారి హుండీ ఆదాయం రూ. 1600 కోట్లు వచ్చే అవకాశం ఉందని తాజాగా అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement