Saturday, May 11, 2024

డేట్, టైమ్‌ చెబితే ఏపీ అంతా తిప్పి చూపిస్తా.. కేటీఆర్‌కు రోజా బంపర్​ ఆఫర్

ఏపీలో రోడ్లు, మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసి వ్యాఖ్యానించి ఉంటే బాగుండేదన్నారు. ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం రోజా హైదరాబాదులో ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో భేటీ అయిన త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ పరిస్థితుల గురించి ఎవరో చెప్పారని కేటీఆర్ అంటున్నారని, ఆ చెప్పిందెవరో గానీ కేటీఆర్ ను తప్పుదోవ పట్టించారని రోజా వెల్లడించారు. “కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను వాట్సాప్ లో చూశాను. ఒక యంగ్ డైనమిక్ లీడర్ గా, స్ఫూర్తిదాయకమైన నేతగా కేటీఆర్ ను అందరం గుర్తిస్తాం. అటువంటి కేటీఆర్ మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారని నేను అనుకోను. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎక్కడా ఏపీ అనే పదం వాడలేదు. పొరుగు రాష్ట్రాలు అనే మాట వాడారు. ఒకవేళ ఏపీ గురించి అనుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా.

టూరిజం మినిస్టర్ గా నేను కేటీఆర్ ను ఏపీకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకునే సీఎం జగన్ పాలనలో ఏపీ ఎలా ఉందో చూడండి. సీఎం జగన్ అమలు చేస్తున్న అనేక విప్లవాత్మకమైన మార్పులను నేను కేటీఆర్ కు దగ్గరుండి చూపిస్తాను. కేటీఆర్… ఏపీ పరిస్థితులను చెప్పారని భావిస్తున్న ఆయన ఫ్రెండును కూడా తీసుకువస్తే ఏపీలో నాడు-నేడు కింద పాఠశాలలు, ఆసుపత్రులు ఎలా పునరుద్ధరించామో చూపిస్తాను. అంతర్గత రహదారులు, కేంద్రంతో కలిసి నిర్మిస్తున్న జాతీయ రహదారులను కూడా చూపిస్తాను. అవినీతికి తావు లేకుండా, పొరుగు రాష్ట్రం తమిళనాడును కూడా ఆకర్షిస్తున్న ఏపీ వాలంటీర్ వ్యవస్థను కూడా కేటీఆర్ కు చూపిస్తాను. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్న తీరును చూపిస్తాను.

ఇవన్నీ చూపిస్తే తెలంగాణలోనూ ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టాలని కేటీఆర్ తప్పక అనుకుంటారు. ఆ ఫ్రెండు చెప్పింది తప్పు అని కూడా కేటీఆర్ తెలుసుకుంటారని భావిస్తున్నా. మరి కేటీఆర్ ఏపీకి ఎప్పుడు వస్తారో డేట్, టైమ్ చెబితే వెయిట్ చేస్తాను. ఆయనకు స్వాగతం పలికి, టూరిజం మినిస్టర్ హోదాలో రాష్ట్రమంతా తిప్పి చూపిస్తాను. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జగన్ సాగిస్తున్న పాలనను చూపిస్తాను” అని రోజా స్పష్టం చేశారు.

ఇవాళ దేశంలో తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, అది అందరికీ తెలిసిన విషయమేనని రోజా అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి కేటీఆర్ వచ్చి చూస్తే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. పక్కనున్న వాళ్ల మాటలు నమ్మి టీవీ చానళ్ల ముందు చెబితే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కేటీఆర్ గుర్తించాలన్నారు. అందుకే కేటీఆర్ స్వయంగా వచ్చి ఏపీలో పరిస్థితులు చూసి అప్పుడు మాట్లాడాలని రోజా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement