Sunday, May 5, 2024

కాపు రిజ‌ర్వేష‌న్లపై ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెండి – హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: కాపులకు ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌పై వేసవి సెలవుల అనంతరం జూన్‌లో తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. విద్యా, ఉపాథి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తీసుకు వచ్చిన చట్టాన్ని, జీవో 60ను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్వస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి విదితమే. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యల తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హరిరామజోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ జోక్యం చేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతంలో ఐదు శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ చట్టం తెచ్చిందని గుర్తుచేశారు.

దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఐదు శాతం కాపులకు ఇవ్వటాన్ని సుప్రీం కూడా సమర్ధించిందని అయితే అమల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించటంలేదన్నారు. విద్యా, ఉపాథి అవకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఇదిలా ఉండగా ఈడబ్ల్యూఎస్‌ కోటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిందని ఇందులో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ కేటాయించటం రాజ్యాంగ విరుద్ధమని మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.. హరిరామజోగయ్య వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం గతంలో కౌంటరు దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా వ్యతిరేక వ్యాజ్యం దాఖలు కావటంతో దీనిపై కూడా స్పందించాలని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ జోక్యం చేసుకుంటూ రి జర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.

వ్యతిరేక వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ని ఆదేశిస్తూ హరిరామజోగయ్య వ్యాజ్యంపై జూన్‌ 26వ తేదీన తుది విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా సున్నితమైన అంశమని వ్యాఖ్యానించింది. కోర్టులో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తీసుకురావాలని హరిరామజోగయ్యకు సూచించింది. లేకపోతే కోర్టులో పెండింగ్‌లో ఉందంటూ ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించింది. రిజర్వేషన్ల అమలు అంశంంపై జూన్‌ 26న తుది విచారణ జరపనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement