తిరుమల (ప్రభన్యూస్) : తిరుమల శ్రీవారిని సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ తరువాత అద్దాల మండపంలో గవర్నర్కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఛైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, విజివోలు బాలిరెడ్డి, మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.