Thursday, April 25, 2024

పోలవరం నిర్మాణంలో మరో అద్భుతం… వరద నీరు మళ్లింపు మొదలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాది చివరి కల్లా ఎట్టి పరిస్దితుల్లోనూ పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. ఈ వర్షాకాలంలో పనులకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోదావరికి వచ్చే వరద నీటిని మళ్లించేందుకు పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసింది. గతంలో వరద నీటి కారణంగా పనులకు ఆటంకం కలగడంతో ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులను మొదలుపెట్టింది నిర్మాణ సంస్థ. నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కి.మీ నదీ ప్రవాహాన్ని మళ్ళిస్తున్నారు.

ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసింది నిర్మాణ సంస్ద. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు అధికారులు మళ్లిస్తున్నారు. పోలవరం స్పిల్‌వే నుంచి ఈ వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. అప్రోచ్‌ ఛానల్‌ నుంచి స్పిల్‌వే మీదుగా స్పిల్ ఛానల్‌ వరకూ వెళ్లి అక్కడి నుంచి మరలా పైలట్‌ ఛైనల్‌ నుంచి సహజ ప్రవాహంలో గోదావరి నది కలవబోతోంది. ఈ లెక్కన చూస్తే ఆరున్నర కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని దారి మళ్లించబోతున్నారు. దీంతో ఈ సీజన్‌లో ప్రాజెక్టు వద్ద పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ ఏడాది 14 గేట్ల ద్వారా ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి  గోదావరి నదీ ప్రవాహాన్ని తరలించనున్నారు.

ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ చకచగా పనులు పూర్తిచేస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌లో 42.5 మీటర్ల ఎత్తులో కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది స్పిల్‌వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్పిల్‌ వే చానల్‌ పనులు పూర్తయ్యాయి. 

ఈ సీజన్‌ నుంచే గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా రివర్‌ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్‌వే రేడియల్‌ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే 14 రేడియల్‌ గేట్లను పైకి ఎత్తి సిద్ధంగా ఉఁచారు. త్వరలో మిగతా గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు పంపుతారు. ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement