Monday, April 29, 2024

వైభవంగా పెన్నఓబులేసుని పల్లకి సేవ

ఉరవకొండ రూరల్ : అనంతపురం జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో
శనివారం స్వామి వారి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామి వారి మూలవిరాట్ కు అభిషేకం, వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. భూదేవి శ్రీదేవి సమేతుడైన లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో, పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో, స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువు దీర్చారు. భాజ భజంత్రీల నడుమ స్వామి వారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. స్వామి వారి పల్లకి సేవను తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ విజయ్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిన్న ముష్టూరు బాబు, నీలప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement