Thursday, May 16, 2024

టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఉచిత క‌ల్యాణోత్సవాలు.. ఆగ‌స్టు 7న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు

తిరుమ‌ల : పెళ్లి విషయంలో పేద‌ల‌కు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వర్యంలో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు నిర్ణ‌యం తీసుకుంది. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునః ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన‌ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ (శుక్రవారం) స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న త‌ర్వాత‌ ఆలయం వెలుపల వైవీ మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజేశఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు పేరు మీద ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించారని గుర్తు చేశారు.

వైఎస్సార్ మరణం త‌ర్వాత‌ ఈ కార్యక్రమం నిలిపి వేశారని, వైసీపి అధికారంలోకి వచ్చినాక‌ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. పేదల‌కు త‌మ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని చెప్పారు. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని ఆయన చెప్పారు. అర్హులైన వారు ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టిటిడి సిద్దంగా ఉందని టిటిడి ఛైర్మన్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement