Monday, April 29, 2024

Exclusive .. ప్రారంభమైన రంజాన్ దీక్షలు …ఉప‌వాసాల‌తో ఆత్మ ప్ర‌క్షాళ‌న‌…

రంజాన్ మాసం పై ప్రత్యేక కథనం
చాంద్ర‌మాన క్యాలండ‌ర్ ఆధారంగా రంజాన్ మాసం..
ప్ర‌తి ఏటా తొమ్మిదో మాసంలో ఈ రంజాన్ దీక్ష‌లు ప్రారంభం
దివ్య ఖురాన్ ఆవిర్భ‌వించ‌న రోజునే దీక్ష మాసం
నేల వంక ద‌ర్శ‌నంతో రోజా ఉపవాస దీక్ష‌లు
దాన ధ‌ర్మాల‌క ప్రాధాన్యం..
రంజాన్ ఉప‌వాసాల‌తో ఆత్మ ప్ర‌క్షాళ‌న‌
అయిదు దివ్య సూత్రాలు పాటింపు.

పొన్నూరు రూరల్ ( ప్రభ న్యూస్): ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో రంజాన్ ఒకటి. ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో ‘రంజాన్’ పండుగ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ ఈ నెలలోనే ఆవిర్భవించింది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ‘రోజా’ ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. నెలవంక దర్శనంతో నెల రోజుల రంజాన్ పండుగ వాతావరణం మొదలవుతుంది. నేడు దేశ వ్యాప్తంగా రంజాన్ ఉప‌వాస దీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి..

క‌ష్టాల‌ను కాపాడేందుకు రంజాన్ మాసం

మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దానధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం.

నెల రోజులు క‌ఠిన ఉప‌వాసాలు

రంజాన్ ఉపవాస దీక్షలు దాదాపు నెల రొజుల పాటు సాగుతాయి. ఈ నెల రోజుల పాటు ముస్లింలు చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను చేస్తారు. ఈ నెలలో తెల్లవారుజామున, సూర్యాస్తమయం తరువాత వారు భోజనం చేస్తారు. సూర్యోదయానికి ముందు తీసుకున్న భోజనాన్ని సహర్ అని, సూర్యాస్తమయం తరువాత తీసుకున్న భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ఈ నెలలోనే దేవుడు ఖురాన్ వచనాలను మొట్టమొదటిసారిగా ముహమ్మద్ ప్రవక్తకు “లైలతుల్‌ ఖద్ర్‌” (శక్తి యొక్క రాత్రి), దీవెనలు చేసినప్పుడు ఈ పవిత్రమైన రాత్రి గురించి వెల్లడించారని ముస్లింలు నమ్ముతారు. ఈ రోజున అల్లాహ్ యొక్క కరుణతో పాటు పాపములు క్షమించబడతాయని వారు విశ్వసిస్తారు.

రంజాన్ దీక్ష‌తో ఆత్మ ప్ర‌క్షాళ‌న

అరబిక్‌లో రంజాన్ అనే పదానికి భరించలేని వేడి, కాలడం అని అర్ధం. ఈ నెల రోజుల ఉపవాస దీక్షలో శరీరాన్ని సుష్కింపజేయడం ద్వారా ఆత్మప్రక్షాళనతో సర్వపాపాలు సమసిపోతాయని ముస్లింల విశ్వాసం. ఆ క్రమంలోనే అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉండి మనోనిగ్రహం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉపవాస దీక్షలతో ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సహనం, ధాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం తదితర ఉత్తమ గుణా లు ఆలవడుతాయని చెబుతారు.
సూర్యోద‌యం, అస్త‌మ‌యం లో ఆన్న‌పానాదులకు దూరం ..

రంజాన్‌ ఉపవాస దీక్షగా వ్యవహరించే ‘రోజా’ను అరబిక్‌ భాషలో ‘సౌమ్‌’, ‘సియామ్‌’ అని అంటారు. సౌమ్‌ అంటే మా నుకొనుట, ఆపుట, ఆగుట, కట్టుబడి ఉండుట అనే అర్థాలు వస్తాయి. ఉపవాసిని ‘సాయమ్‌’ అని అంటారు. ఇస్లామియా పరిభాషలో ప్రభాత పూర్వ సమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు త్యజించడం ఈ ఉపవాస దీక్షకు పరమార్థంగా పేర్కొంటారు. ఈ ఉపవాసదీక్షలతో నిర్మలమైన, నిశ్చలమైన భక్తి భావం ఏర్పడడమే కాకుండా ఆకలి బాధతో అల్లాడే దీనజనుల కష్టాలను స్వయంగా ఉపవాస దీక్షల ద్వారా గుర్తించే అవకాశం లభిస్తుందని చెబుతారు.

- Advertisement -

రంజాన్‌ మాసంలోనే హజ్రత్‌ జిబ్రాయీల్‌ అలై సలాం యేటామహా ప్రవక్తకు దివ్య ఖుర్‌ ఆన్‌ సంపూర్ణంగా వినిపించే వారు. రంజాన్‌ ఆరంభంతోనే ‘తరావీహ్‌’ నమాజ్‌ ఆదేశించబడింది. వేయి రాత్రులకంటే పుణ్య ప్రదమైన రాత్రి ‘లైలతుల్‌ ఖద్ర్‌’ ఈ నెలలోనే ఉంది. ఆర్థిక ఆరాధనైన ‘జకాత్‌’ చెల్లించడం.. నిరుపేదల హక్కు అయిన ‘ఫిత్రా’ చెల్లించడం.. దైవ ప్రసన్నత చూరగొనే వనవ్రతం (ఏతెకాఫ్‌) పాటించడం వంటివి రంజాన్ లో ఆచరిస్తారు. మహాప్రవక్తకు రమజాన్‌ మాసం 21వ తేదీన ప్రవక్త పదవి లభించిందని చరిత్ర చెబుతోంది.

రంజాన్ మాసం ముగింపు రోజున ఈద్ అల్-ఫితర్

పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తరువాత, ఈద్ అల్-ఫితర్ జరుగుతుంది. షవ్వాల్’ నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ‘ ఈదుల్‍ ఫితర్ ‘ అని అంటారు. భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు ఝామున నమాజ్ చదివి పడుకుంటారు.

ఈ నెలంతా దాన‌ధర్మాల‌కు ప్రాధాన్యం

రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘ జకాత్ ‘ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ‘ జకాత్’ అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ‘ జకాత్ ‘ ఉపయోగపడుతుంది.

జకాత్’ తో పాటు ‘ ఫిత్రా’ దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ‘ ఫిత్రాదానం’ అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement