Sunday, May 5, 2024

Exclusive – క్యాస్ట్… డామినేషన్ – మారిన ఎన్నికల తీరు

వారిదే ప్రాబల్యం..
ఈ రెండు కులాలదే ఆధిపత్యం
అసెంబ్లీలో 40 శాతానికి పైగా వాటా వారే!
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. విభజిత ఆంధ్రాలోనూ వాళ్లదే హవా
2014లో 40 మంది రెడ్లు..
33 మంది కమ్మలు
2019లో 48 మంది రెడ్లు, 17 మంది కమ్మలు
ఈ ఎన్నికల్లో అదే సీన్‌ రిపీటయ్యే అవకాశం

ఆంధ్రప్రభ స్మార్ట్ ప్రతినిధి, బెజవాడ: రాష్ట్రం విడిపోయి పదేళ్ళయింది.. కులం మాత్రం కలిసికట్టు-గానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐక్యత, ఆధిపత్యం ఎక్కడా చెక్కు చెదరకపోగా ఇపుడు మరింత ధృఢంగా మారింది. ఏపీలో రాజకీయ ఆధిపత్యవర్గంగా, పాలక కులాలుగా ముద్రపడ్డ రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు అసెంబ్లీలో అత్యధికస్థాయి ప్రాతినిధ్యంతో తమ ప్రాబల్యాన్ని నిరూపించుకుంటు-న్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా వారికున్న పట్టు- రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా కొనసాగుతుంది. టీ-డీపీ అధికారంలో ఉంటే కమ్మలదీ, వైసీపీ అధికారంలో ఉంటే రెడ్లదే హవా. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీ-డీపీ అధికారంలోకి వచ్చింది. 2014లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 40 మంది రెడ్డి, 33 మంది కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున 31 మంది, టీ-డీపీ తరపున 9 మంది.. మొత్తం 40 మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా టీ-డీపీ తరపున 29 మంది, వైసీపీ తరపున ముగ్గురు, బీజేపీ తరపున ఒకరు.. మొత్తం 33 మంది కమ్మలు ఎమ్మెల్యేలుగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఆ రెండు సామాజికవర్గాలు తమ హవాను కొనసాగించాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన 48 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా కమ్మ సామాజికవర్గానికి చెందిన 17 మంది శాసనసభ్యులుగా గెలుపొందారు. 2019లో తెలుగుదేశం ఓడిపోవటంతో అసెంబ్లీలో కమ్మ సామాజికవర్గ ప్రాతినిధ్యం తగ్గుముఖం పట్టింది. అయినా గెలిచిన టీ-డీపీ గెలిచిన 23 స్థానాల్లో 11 మంది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావటం విశేషం. వైసీపీ నుంచి కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆరుగురు గెలుపొందటంతో మొత్తం 17 మంది అసెంబ్లీలో అడుగపెట్టారు. 2019 ఎన్నికల్లో కేవలం వైసీపీ తరపున 48 మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో 49 మంది రెడ్లకు వైసీపీ టికెట్లు- ఇస్తే ఉరవకొండ నుంచి పోటీ- చేసిన విశ్వేశ్వర్‌ రెడ్డి తప్ప మిగతా 48 మంది రెడ్లు గెలుపొందారు. వీరిలో రాయలసీమకు చెందిన రెడ్లు 31 మంది ఉంటే కోస్తా జిల్లాలకు చెందిన రెడ్లు 17 మంది ఉన్నారు. కమ్మ, రెడ్లు కలిపి 2014లో 73 మంది గెలిస్తే 2019లో 67 మంది గెలిచారు. 175 సీట్లు-న్న ఏపీ అసెంబ్లీలో ఈ రెండు కులాల ప్రాతినిధ్యం 40 నుంచి 45 శాతం ప్రాతినిధ్యం వారిదే. 2024 ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు సీట్లిచ్చిన సరళిని పరిశీలిస్తే 2014, 2019లో కమ్మ, రెడ్లు ఏ స్థాయిలో అత్యధిక ప్రాతినిధ్యాన్ని పొందారో ఈ ఎన్నికల్లోనూ ఏ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టినా అదే స్థాయి ఆధిపత్య సంఖ్యతో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

34 మంది బీసీలు
ఏపీ అసెంబ్లీలో 2019 ఎన్నికల ద్వారా 34 మంది బీసీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టారు. 28 మంది వైసీపీ తరపున గెలిస్తే ఆరుగురు టీ-డీపీ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. 29 మంది ఎస్సీలు, 7 గురు ఎస్టీలు, 25 మంది కాపులు, నలుగురు క్షత్రియులు, నలుగురు ఆర్యవైశ్య, ఇద్దరు బ్రాహ్మణులు, ఒక వెలమ, నలుగురు ముస్లింలు ఎమ్మెల్యేలుగా గెలుపొంది అసెంబ్టీలో అడుగుపెట్టారు. ఈ సారి ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ సోషల్‌ మెకానిజమ్‌లో భాగంగా ప్రాబల్యమున్న చోట రెడ్ల ప్రాధాన్యత తగ్గించకుండానే జనరల్‌ సీట్లలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 175 సీట్లలో 48 సీట్లను బీసీలకు కేటాయించింది. 20 అన్‌ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానాల్లో 11 చోట్ల బీసీలను బరిలోకి దింపింది. ఆయా ప్రాంతాల్లో ప్రాబల్యం ఆధారంగా బీసీల్లోని అన్ని కులాలకు సీట్లు- దక్కేలా జాగ్రత్తపడ్డారు. ఆ స్థాయిలో కూటమి నుంచి కానీ, టీ-డీపీ నుంచి కానీ బీసీలకు సీట్లు- రాకపోవటంతో దీన్ని వైసీపీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏ సామాజికవర్గం నుంచి ఎంతమంది అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తారో, సామాజిక సమీకరణలు ఎన్నికల్లో ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement