Monday, April 29, 2024

Election – ప‌ట్టుబ‌డుతున్న నోట్ల క‌ట్ట‌లు – దేశవ్యాప్తంగా రూ.4650 కోట్లు స్వాధీనం

అక్రమ సొత్తు లెక్క తేలుతోంది
తొలి పోలింగ్‌కు ముందే ఈసీ ప్రతాపం
రూ.395 కోట్ల నగదు
రూ.562 కోట్లు బంగారం
రూ.489 కోట్లు మద్యం
రూ,2600 కోట్లు డ్రగ్స్
సగటున రోజుకు రూ.100 కోట్లు పట్టివేత

(ఆంధ్రప్రభ స్మార్ట్, దిల్లీ ప్రతినిధి) సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌కు ముందే కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. రూ. 4650 కోట్ల నగదు, నగలు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న నగదులో ఏపీ అగ్రస్థానంలోనూ, తెలంగాణ తరువాత స్థానంలో ఉన్నాయి. ఏపీలో రూ.125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు అక్రమ నగదు లభించింది. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, 2019తో పోల్చితే ఈ ఎన్నికల ఆరంభంలోనే అత్యధిక సొమ్మును స్వాధీనం చేసుకునట్టు వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలోనే ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకోలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. . రోజుకు సగటున రూ.100 కోట్లు దొరికింది.


దేశంలోనే నగదు స్వాధీనంలో ఏపీ టాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాదీనం చేసుకున్న రూ.125.97 కోట్లలో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన లిక్కరు, రూ4.06 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్ మెటల్స్, రూ.12.89 కోట్ల విలువైన ఫ్రీబీస్/ఇతర వస్తులను రాష్ట్రంలో స్వాదీనం చేసుకున్నారు. . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్సీలు, 20 కి పైగా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీలతో తరచుగా సమీక్షలు,సమావేశాలు నిర్వహించడంతో ఇది సాధ్యమైంది. అదే విదంగా రాష్ట్ర వ్యాప్తంగాచెక్ పోస్టులు, అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల్లో పటిష్టమై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈసీ రికవరీ చేస్తున్న నగదు, మద్యం, మాదక ద్రవ్యాలలో సింహభాగం 45 శాతం వాటా డ్రగ్స్ కే ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటి వరకు రూ.395.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా మద్యం రూపంలో రూ.489.31 కోట్ల విలువ చేసే 35.82 కోట్ల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, ఇతర విలువైన లోహాల రూపంలో రూ.562.10 కోట్లు రికవరీ చేయగా రూ.2068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. టీవీలు, ఫ్రిడ్జిలు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

టాప్ లో రాజస్థాన్, గుజరాత్ టాప్:

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో రూ. 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో నగదు రూ.49,1818260 నగదు, రూ.19.2125880 విలువ గల 68,5838.52 లీటర్ల మద్యం, రూ.22,7139650 విలువైన డ్రగ్స్, రూ.30,741334 బంగారం, ఇతర విలువైన లోహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement